
ఉగ్రవాదంపై పోరుకు దేశ ప్రజల అండ
కడప కార్పొరేషన్: ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న పోరుకు దేశ ప్రజలంతా అండగా ఉన్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం కోసం రాత్రింబవళ్లు కాపుకాస్తున్న సైనికులకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషియల్ మీడియా నాయకులను వేధించడమే లక్ష్యంగా తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా కేవలం పదినెలల కాలంలోనే రూ.1.70 లక్షల కోట్లు అప్పులు చేశారని, ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటి పై పోలీసుల దాడులు అప్రజాస్వామికమన్నారు. తమ తప్పులను ప్రశ్నించే వారు ఉండకూడదనే సాక్షిపై కక్షగట్టారన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చుట్టూ ఉన్నవారందరినీ లక్ష్యంగా చేసుకొని లేని లిక్కర్ స్కాంను తెరపైకి తెచ్చి అబద్ధాలే ఆరోపణలుగా కేసులు పెడుతున్నారన్నారు. ఈ కక్షసాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్ప దన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు పులి సునీల్ కుమార్, పాక సురేష్ కుమార్, బంగారు నాగయ్యయాదవ్, బాలయ్య యాదవ్, సుబ్బయ్య, త్యాగరాజు, వాసుదేవ రెడ్డి, శ్రీరంజన్రెడ్డి, కంచుపాటి బాబు పాల్గొన్నారు.
సాక్షి ఎడిటర్ ఇంటిపై దాడి దారుణం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి