
వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ వ్యతిరేకం
కడప రూరల్ : కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వంతో పాటు టీడీపీ కూటమి లాంటి పార్టీలు బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలను అణచివేసేందుకు కుట్ర పన్నుతున్నాయి. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం 2025ను తీసుకొచ్చింది. కుల, మతాలు , పార్టీల కతీతంగా ఏకమై ఈ చట్టంపై పోరాటం చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో ఆ బోర్డ్ కన్వీనర్ హజరత్ ఇషాక్ అలీ అధ్యక్షతన రాజ్యాంగ వ్యతిరేక వక్ఫ్ చట్టం–2025కు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పహల్గాం, సింహాచలంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. అనంతరం కడప మేయర్ సురేష్బాబు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మైనార్టీలకు ఎక్కువగా ద్రోహం చేసిందన్నారు. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. సవరణ చట్టంపై తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తే బిల్లును అడ్డుకోవచ్చన్నారు. భారతదేశం అన్ని కులాలు, మతాలకు నిలయమని పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరూ ఏకమై సవరణ చట్టంపై పోరాడాలని తెలిపారు. మైనార్టీలకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగానే ఉంటుందని అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చట్టాన్ని తేవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీలకు ఒక్క మేలైనా చేసిందా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అణచివేయడానికే ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్టీఏ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు నితీష్కుమార్ లాంటి వారు మద్దతు తెలపడంతోనే సవరణ చట్టానికి ఆమోదం లభించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ చట్టం ద్వారా మైనార్టీలకు మేలు జరుగుతుందని దుష్ప్రచారం చేస్తోందన్నారు. హజరత్ ఇషాక్ అలీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. అందులో భాగంగానే వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చిందని తెలిపారు. వక్ప్ పరిరక్షణ జేఏసీ కన్వీనర్ బాబూ భాయ్ మాట్లాడుతూ సవరణ చట్టం ఏకపక్షంగా చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. మహ్మద్ అలీ బహుదాది, జాకీర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సత్తార్, పాస్టర్ జాన్ మాట్లాడారు.
లాంగ్ మార్చ్ను విజయవంతం చేయాలి..
ఈ నెల 4వ తేదీన కడప నగరంలోని గౌస్నగర్ నుంచి ప్రారంభించే లాంగ్ మార్చ్ను విజయవంతం చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుల మతాలు, పార్టీల కతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి, మౌలానా హిదాయతుల్లా, అలీఖాన్, బాదుల్లా, గుర్రప్ప, నారాయణరెడ్డి, కార్పొరేటర్ షఫి, సుభాన్బాషా, కరీముల్లా, ఇలియాస్, పులి సునీల్కుమార్, న్యాయవాది రాఘవరెడ్డి, నజీర్ అహ్మద్, సీఆర్వీ ప్రసాద్, సంఘ సేవకుడు సయ్యద్ సలావుద్దీన్, మగ్బూల్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు మద్దతు తెలపడం దారుణం
మైనార్టీలకు తోడూ నీడగా వైఎస్సార్సీపీ
ఉద్యమాల ద్వారానే
సవరణ చట్టం ఉపసంహరణ
4న కడపలో నిర్వహించే
లాంగ్ మార్చ్ను విజయవంతం చేయాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు