
వైభవోపేతంగా అక్షయ తదియ
వల్లూరు: పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ కామాక్షీ వైద్యనాఽథేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వాముల బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం వైభవోపేతంగా జరిగిన అక్షయ తదియ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. పెన్నా నదిలో స్నానాలు ఆచరించారు. అనంతరం ఉత్సవాలలో పాల్గొని స్వామి వార్లను దర్శించుకుని కాయ కర్పూరాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడ పితృ దేవతలకు పిండ ప్రదానం చేస్తే కాశీలో చేసినంత పుణ్యం లభిస్తుందనే ప్రగాఢ విశ్వాసంతో అనేక మంది భక్తులు బ్రాహ్మణుల ఆధ్వర్యంలో తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు.
వైభవంగా చెన్న కేఽశవుని పూలంగి సేవ
శ్రీ చెన్నకేశవ స్వామికి పూలంగి సేవను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో స్వామి వారిని వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర ఆలయంలో అర్చకులు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైద్యనాఽథునికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ చక్ర సహిత కామాక్షీ అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త దుగ్గిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, ఉభయదారులు పాల్గొన్నారు.
తగ్గిన భక్తులు
రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చే ఈ బ్రహ్మోత్సవాలపై దేవాదాయ శాఖ అధికారులు ఈ ఏడాది సరైన ప్రచారం కల్పించకపోవడంతో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
ఇష్ట వాహనాలపై హరి హరులు
రాత్రి శ్రీ చెన్నకేశవ స్వామి తనకు అత్యంత ప్రీతి పాత్రమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామంలోని శ్రీ కామాక్షీ వైద్యనాఽథేశ్వర స్వాములు తమకు ఇష్టమైన నంది వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు.
నేడు కల్యాణోత్సవాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఉదయం 10 గంటలకు శ్రీ కామాక్షీ వైద్యనాఽథ స్వాములకు కల్యాణ మహోత్సవం జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి శ్రీలక్ష్మీ చెన్న కేశవ స్వామికి శ్రీదేవి , భూదేవిలతో కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రాత్రి వైద్యనాథ స్వామికి, చెన్న కేశవ స్వామికి గజవాహన సేవ ఉంటుంది.

వైభవోపేతంగా అక్షయ తదియ