పల్లెల్లో స్మార్ట్ ప్రచారం
హాలియా : గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో గ్రామాల్లో రచ్చబండ వద్ద స్థానికులు సమావేశమై సమస్యలు, అభివృద్ధితో పాటు ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై మాట్లాడుకునే వారు. పోటీ చేసే వారు సైతం రచ్చబండ వద్దకే వచ్చి తమ అజెండా, హామీలను వివరించేవారు. కానీ ఇప్పుడు అందరూ సోషల్ మీడియానే ఎంచుకుంటున్నారు. ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకోవాలి, ప్రధాన సమస్యలేమిటనే విషయాన్ని కూడా గ్రామ వాట్సాప్ గ్రూపుల్లోనే చర్చిస్తున్నారు. అభ్యర్థులు తమ అజెండాను స్థానిక గ్రూపుల్లో పోస్ట్ చేస్తూ, ఫోన్లో స్టేటస్ ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు.
భువనగిరి : గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు స్మార్ట్ఫోన్లతో ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. గతంలో కరపత్రాలు, వాల్పోస్టర్లు, వాల్పెయింటింగ్తో ప్రచారం నిర్వహించేవారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను ఇస్తూ వాల్పోస్టర్లను గోడలకు అతికించేవారు. కానీ ఇప్పుడు సర్పంచ్తో పాటు వార్డు సభ్యుల పోటీదారులు సోషల్ మీడియానే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నారు.
వాట్సాప్లో పోస్టులు
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే కొంత మంది ఆశావహులు తాము ఈ సారి ఎన్నికల బరిలో ఉంటున్నామంటూ సోషల్మీడియా వేదికగా ప్రచారం మొదలు పెట్టారు. ఇక నోటిఫికేషన్ రాగానే విస్తృతంగా ప్రచారాన్ని ప్రారంభించారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లో నిత్యం పోస్టులు పెడుతూ ప్రచారం ముమ్మురం చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓటర్ల ఫోన్ నంబర్లను తెలుసుకుని ప్రతిరోజూ ప్రచారం వీడియోలను, తమకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్న పోటోలను పంపిస్తున్నారు. తాము గెలిస్తే ఏం చేస్తారో ఆ విషయాన్ని కూడా పోస్టుల ద్వారా షేర్ చేస్తున్నారు. తమ కుల సంఘాల వారికి ఫోన్లు చేస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
స్టేటస్గా ప్రచార వీడియోలు
సర్పంచ్, వార్డు సభ్యుల పోటీదారులు తమను గెలిపించాలని కోరుతున్న వీడియోలను తమ అనుచరుల ఫోన్లలో స్టేటస్ పెట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం యువకులు ప్రతి గ్రామానికి ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయగా ఆయా గ్రామాల గ్రూపులలో వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామంలో తాము చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎడిట్ చేసి వాటికి బ్యాగ్గ్రౌడ్ పాటలను సెట్ చేసి మరీ పంపిస్తున్నారు. మరి కొందరు అభ్యర్థులు ఇప్పటికే తమ పేరు మీద ప్రత్యేకంగా పాటలను రాయించుకొని మరీ ప్రచారంలోకి దిగారు. ఓటర్లను ఆకట్టుకునేలా సోషల్ మీడియాలో నిత్యం పోస్టులు పెడుతున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల వరకు కొంత మంది యువకులతో కమిటీ వేసి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.
ఫ సోషల్మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు
ఫ పంచాయతీలు, వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపులు
ఫ తమను గెలిపించాలంటూ పోస్టులు, వీడియోలు
పల్లెల్లో స్మార్ట్ ప్రచారం


