
పెద్దదేవులపల్లి వాసికి డాక్టరేట్
త్రిపురారం: త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన పసుల సైదులు, రాములమ్మ దంపతుల కుమారుడు మధుబాబు అమెరికాలోని యూనివర్సీటీ ఆఫ్ లూసియానాలో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ అందుకున్నాడు. న్యూరో సైన్స్ విభాగంలో చేసిన మధుబాబు చేసిన పరిశోధనకు గాను శనివారం రాత్రి యూనివర్సీటీలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ వేడుకల్లో డాక్టరేట్ ప్రదానం చేశారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన మధుబాబు చిన్నప్పటి చదువులో చురుగ్గా ఉండేవాడని, అతడికి డాక్టరేట్ రావడం పట్ల తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
గంజాయి తాగుతూ పట్టుబడ్డ యువకులు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం మహబూబ్పేట గ్రామంలో ఆదివారం గంజాయి తాగుతూ ముగ్గురు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాబూబ్పేట గ్రామ శివారులో ఆదివారం కొంతమంది యువకులు గంజాయి తాగుతున్నారని పక్కా సమాచారం రావడంతో ఎస్ఐ అనిల్కుమార్ తన బృందంతో కలిసి దాడులు జరిపారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన ముగ్గురు గాజుల బాలకృష్ణ, గాజుల ప్రవీణ్, గాజుల సాయి గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 150 గ్రాముల గంజాయి, రెండు బైక్లు, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
షార్ట్ సర్క్యూట్తో
గోల్డ్ వర్క్షాప్ దగ్ధం
మిర్యాలగూడ అర్బన్: షార్ట్ సర్క్యూట్తో గోల్డ్ వర్క్షాప్ దగ్ధమైంది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి మిర్యాలగూడ పట్టణలో చోటు చేసుకుంది. మిర్యాలగూడ పట్టణంలోని పెద్దబజారులో మారోజు కిరణ్కుమార్, మునగాల శ్రీనివాస్ బంగారం వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. రోజుమాదిరిగా శనివారం రాత్రి షాప్ మూసివేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో షాప్ నుంచి మంటలు వస్తుండటంతో స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి, షాప్ యజమానులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రూ.5లక్షలతో పాటు ఐదు తులాల బంగారం దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు.
కార్లు ఢీకొని చుక్కల దుప్పి మృతి
మిర్యాలగూడ: రోడ్డు దాటుతున్న చుక్కల దుప్పిని రెండు కార్లు ఢీకొట్టడంతో మృతిచెందింది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ముఖేష్ తెలిపిన వివరాల ప్రకారం.. బొత్తలపాలెం గ్రామ శివారులో చుక్కల దుప్పి రోడ్డు దాటుతుండగా.. కల్లేపల్లి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. అదే సమయంలో కల్లేపల్లి నుంచి మిర్యాలగూడకు వస్తున్న మరో కారు కూడా దుప్పిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దుప్పి కళేబరాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొండ్రపోల్ పీహెచ్సీలో దుప్పి కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

పెద్దదేవులపల్లి వాసికి డాక్టరేట్