
గుర్రపుడెక్కతో నిండిన వలిగొండ మండల కేంద్రంలోని అక్కచెల్లెళ్ల చెరువు
సాక్షి యాదాద్రి : మూసీ ఆధారిత కాలువలు, చెరువులు అధ్వానంగా తయారయ్యాయి. గుర్రపు డెక్కతో నిండిపోయి చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. మరమ్మతులు పేరిట అధికారులు ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చూపుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. నూతన ప్రభుత్వం సాగునీటి వనరులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో మూసీ పరీవాహకంలో గుర్రపుడెక్కను కూడా తొలగించాలన్న డిమాండ్ పెరుగుతోంది.
ప్రధాన సాగునీటి వనరుగా మూసీ
జిల్లాలోని భూదాన్పోచంపల్లి, బీబీనగర్, భువనగిరి, వలిగొండ, రామన్నపేట, ఆత్మకూర్(ఎం) మండలాల పరిధిలో రైతులకు మూసీ ప్రధాన సాగునీటి వనరు.రైతులు ప్రధానంగా వరి, కూరగాయల సాగు చేస్తుంటారు. వీటితో పాటు పాడి, మత్స్య సంపదపైఆధారపడుతుంటారు. అయితే మూసీ ఆధారిత కాలువల ద్వారా సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
ఆయకట్టులో 50 కాలువలు, 90 చెరువులు
జిల్లా పరిధిలో 357 కిలో మీటర్ల పొడవునా మూసీ ఆధారిత కాలువలు 50, చెరువులు 90 వరకు ఉన్నాయి. గుర్రపుడెక్క కారణంగా కాలువల్లో నీరు ముందుకెళ్లడం లేదు. ఫలితంగా చెరువుల్లోకి, చివరికి ఆయకట్టుకు నీరు చేరడం లేదు. ఓ వైపు గుర్రపుడెక్క, మరోవైపు మరమ్మతులు లేక కాలువలు శిథిలావస్థకు చేరి గండ్లు పడుతున్నాయని రైతులు వాపోతున్నారు.
మరమ్మతులు లేక.. నీళ్లు రాక
మూసీ ఆధారిత కాలువలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రధానంగా గుర్రపుడెక్క నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారింది. కాలువల మరమ్మతుల పేరిట అధికారులు ఏటా లక్షలాది రూపాయల ఖర్చు చూపుతున్నారు. కానీ, సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. నూతన ప్రభుత్వం సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించడంతో గుర్రపుడెక్క ఆకును తొలగించేందుకు కార్యాచరణ రూపొంబదించాలని రైతులు నీటిపారుదల శాఖ అధికారులను కోరుతున్నారు.
మత్స్యకారుల ఇక్కట్లు
గుర్రపుడెక్క కారణంగా మత్స్యకారులు ఇబ్బందులకు గురవుతున్నారు. చెరువుల్లో చేపలు పట్టడానికి గుర్రపుడెక్క అడ్డంకిగా మారింది. పాడి రైతులు సైతం సమస్యలు ఎదుర్కొంటున్నారు.
మూసీ కాల్వలు, చెరువులను కప్పేసిన గుర్రపుడెక్క
ఫ సాఫీగా వెళ్లని సాగు నీరు
ఫ ఏటా నష్టపోతున్న ఆయకట్టు రైతులు
ఫ మత్స్యకారులూ విలవిల
ఫ కాగితాలపైనే మరమ్మతులు
ఫ నూతన ప్రభుత్వంపై ఆశలు
ఇక్కడ కనిపిస్తున్నది బునాదిగాని కాలువ. కాలువ ప్రారంభం అయ్యే చోటు మక్తా అనంతారం నుంచి గుర్రపుడెక్క పేరుకు
పోయింది. బ్రాహ్మణపల్లి, ఎర్రబెట్టతండా, పడమటిసోమారం నుంచి ముగ్దుంపల్లి వాగు వరకు సుమారు 20 కిలో మీటర్ల మేర ఇదే దుస్థితి. గుర్రపుడెక్క నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారడంతో వరి నాట్లు వేసే సమయంలో
రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విధిలేక సొంత ఖర్చులతో తొలగిస్తున్నారు.
సాగునీరు సరిగా వస్తలేదు
వలిగొండలోని అక్కాచెల్లెళ్ల చెరువు పూర్తిగా గుర్రపుడెక్క ఆకుతో నిండిపోయింది. గుర్రపుడెక్క కారణంగా పంట పొలాలకు సాగునీరు సరిగా అందడం లేదు. తూముల వద్ద గుర్రపుడెక్క అడ్డంగా ఉంది. యాసంగి సీజన్ ప్రారంభం అయినందున అధికారులు తక్షణమే గుర్రపుడెక్కను తొలగించాలి.
–నానచర్ల రమేష్, రైతు, వలిగొండ

●
