
సచివాలయ ఏఎన్ఎం కౌన్సెలింగ్లో రగడ
ఏలూరు టౌన్: జిల్లాలోని సచివాలయాల్లో ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న సిబ్బందిని మాతృసంస్థ వైద్య ఆరోగ్యశాఖలోకి నియామకాలు చేపట్టేందుకు నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ ఆకస్మికంగా నిలుపుదల చేయడంతో ఏఎన్ఎంలు ఆందోళనకు దిగారు. ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్.మాలిని 4వ తేదీన కౌన్సెలింగ్ చేపడతామని ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఏఎన్ఎంలు ఏలూరులోని డీఎంఅండ్హెచ్ఓ కార్యాలయానికి బుధవారం ఉదయం 10 గంటలకే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తమకు బదిలీ కౌన్సెలింగ్, పదోన్నతులు ఇచ్చిన అనంతరం మాత్రమే సచివాలయ ఏఎన్ఎంలకు కౌన్సెలింగ్ చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సీనియర్ ఏఎన్ఎంలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో కౌన్సెలింగ్ అర్ధాంతరంగా నిలిపివేశారు. దీనిపై సాయంత్రం వరకు అధికారుల నుంచి సమాధానం లేకపోవడంతో సచివాలయ ఏఎన్ఎంలు కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. తమకు గత ప్రభుత్వంలో 2022లో 179 జీఓ మేరకు వైద్య ఆరోగ్యశాఖలో నియమాకాలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారని అనంతరం 2024 కూటమి ప్రభుత్వంలోనూ అక్టోబర్లో మరోసారి కౌన్సెలింగ్ చేపట్టి వైద్య ఆరోగ్య శాఖలో నియామకం చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారని చెబుతున్నారు. దీంతో గందరగోళ వాతావరణం నెలకొనడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాలిని, రెవెన్యూ అధికారులు ఈ అంశంపై ఇరువర్గాల నాయకులతో చర్చించి సానుకూలమైన చర్యలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం రాత్రి 10 గంటల వరకు చర్చలు సాగుతూనే ఉన్నాయి.
తొలుత తమకు బదిలీ కౌన్సెలింగ్లంటూ సీనియర్ల పట్టు
అర్ధాంతరంగా నిలిచిపోయిన కౌన్సెలింగ్