
ఇక కొత్త రేషన్కార్డులు
సాక్షి, వరంగల్: జిల్లాలో కొత్త రేషన్కార్డుల మంజూరుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించడంతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు కొత్త రేషన్కార్డుల జారీకి సన్నాహాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం తదితర పథకాల అమలుపై అధికారులు దృష్టి సారించడంతో కొత్తకార్డుల జారీ ప్రక్రియ నిదానమైంది. ప్రభుత్వం గత జనవరి నుంచే కొత్త రేషన్కార్డుల సర్వే చేపట్టి, అర్హులకు కార్డులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసినా వివిధ పథకాలతో ఆలస్యమైంది.
క్షేత్రస్థాయిలో అధికారుల సర్వే..
కొత్త రేషన్కార్డుల కోసం ప్రజాపాలనలో మొత్తం 12,773 వచ్చాయి. మీ సేవ కేంద్రాల నుంచి 14,087 దరఖాస్తులు అందాయని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికను పౌరసరఫరాల విభాగాధికారులకు పంపాల్సిన తహసీల్దార్ కార్యాలయాల్లోని సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన నెమ్మదిగా చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ డాక్టర్ సత్యశారద కూడా కొత్త రేషన్కార్డుల క్లియరెన్స్ ప్రక్రియ సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంతవరకు నత్తనడకన సాగిన ప్రక్రియ ఇప్పుడు వేగవంతంగా జరుగుతోంది. మరో వారం రోజుల్లో పూర్తిచేసే దిశగా ఇరు విభాగాధికారులు పనిచేస్తున్నారు. రేషన్కార్డులు మంజూరు కానుండడంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదల ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన ఈ రేషన్కార్డుల ద్వారా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇంకా తేల్చాల్సినవి ఎనిమిది వేలపైనే..
జిల్లాలో మొత్తం 2,66,621 రేషన్ కార్డులున్నాయి. వీటిలో 2,52,799 ఆహార భద్రత కార్డులు, 13,855 అంత్యోదయ అన్నయోజన కార్డులు, ఏడు అన్నపూర్ణ కార్డులున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీ సేవ కేంద్రాల ద్వారా 14,087 మంది కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే వీటిలో 5,667 మాత్రమే అధికారులు క్లియర్ చేశారు. పలు కారణాలతో 124 కార్డులను పౌరసరఫరాల విభాగాధికారులు తిరస్కరించారు. మిగిలిన 8,296 దరఖాస్తులను అన్ని మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. వీటిలో కొన్ని ఇప్పటికే పౌరసరఫరాల శాఖ 360 డిగ్రీ యాప్లో తుది జాబితాను తనిఖీ చేస్తున్నారు. ఈ అధికారుల ఆమోదంతో రేషన్కార్డుల జారీ ప్రక్రియ పూర్తవుతుంది. సాధ్యమైనంత తొందరగా క్లియర్ చేయడంపై దృష్టి సారించారు.
రేషన్కార్డుల జారీపై ప్రత్యేక దృష్టి..
జిల్లాలో కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాం. రెండు నెలల్లో రేషన్కార్డుల్లో పేర్ల మార్పులు, చేర్పులు చేశాం. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జారీ కోసం రెవెన్యూ సిబ్బందితో కలిసి పనిచేస్తున్నాం. దళారులను నమ్మి రేషన్కార్డు ఇప్పిస్తామంటే నమ్మొద్దు. అలా ఎవరైనా డబ్బులు తీసుకుని కార్డులు ఇప్పిస్తామంటే ఆ సమాచారం చేరవేయాలి.
– కిష్టయ్య, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
కలెక్టర్ సత్యశారద ఆదేశాలతో
జారీ ప్రక్రియ వేగవంతం
ఇప్పటివరకు 14,087 దరఖాస్తుల్లో 5,667 క్లియర్
పలు కారణాలతో 124 అర్జీలను
తిరస్కరించిన అధికారులు
వారంలో పూర్తిచేయనున్న రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ

ఇక కొత్త రేషన్కార్డులు

ఇక కొత్త రేషన్కార్డులు