
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
● పీహెచ్సీ, సీహెచ్సీ భవన నిర్మాణాల్లో జాప్యంతో తప్పని అవస్థలు
● ఎరువులు, విత్తనాల ధరల
నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
● జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చర్చించిన జెడ్పీ చైర్మన్, సభ్యులు
● తాటిపూడి నీటి మళ్లింపుపై ఎటువంటి చర్చ జరగలేదు: మంత్రి కొండపల్లి
విజయనగరం: సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు.. పీహెచ్సీ, సీహెచ్సీ భవన నిర్మాణాల పూర్తి.. ఎరువులు, విత్తనాల ధరల నియంత్రణ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుదల.. తదితర అంశాలపై విజయనగరం జిల్లా పరిషత్ సమావేశంలో సభ్యులు చర్చించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వవిప్ తోయక జగదీశ్వరి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, శ్యాంప్రసాద్, సభ్యులు పాల్గొన్నారు. తొలుత అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో వైద్యం, వ్యవసాయం, విద్య రంగాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
● ఒకే మంచంపై ముగ్గురు రోగులకు వైద్యమా?
ఏజెన్సీలోని ఆస్పత్రుల్లో ఒకే మంచంపై ముగ్గురు రోగులకు వైద్యం చేస్తున్నారని, కురుపాం సీహెచ్సీకి రోగుల తాకిడి పెరుగుతున్నా అవసరమైన భవన నిర్మాణ పనులు పూర్తి చేయడంలో తాత్సారం చేస్తున్నారంటూ కురుపాం మండల జెడ్పీటీసీ సభ్యురాలు గొర్లె సుజాత, ఎంపీపీ శెట్టి పద్మావతిలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, కొత్తవలసలో ఆసుపత్రి భవన నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడంతో స్థానికంగా ఉన్న ఎన్జీఓ హోంలో రోగులకు సేవ లందిస్తున్నారని, ఒకే గదిలో రోగులకు తనిఖీలు, ఆపరేషన్లు చేస్తున్నారని జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి సభలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన అధికారులు త్వరలో భవన నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందుస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో స్కానింగ్ యంత్రాలు ఎందుకు పని చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. సర్వజన ఆస్పత్రి నుంచి విశాఖలో కేజీహెచ్కు రిఫరల్ కేసుల సంఖ్య పెరుగుతోందని, ప్రజాప్రతినిధులు ఫోన్ చేసి చెబితే మరింత వేగంగా ఇతర ఆస్పత్రులకు పంపించడం వెనుక అంతర్యమేమటన్నారు. స్పందించిన సూపరిండెంట్ కార్డియాలజీ, గ్యాస్ట్రో తదితర అత్యవసర కేసులను తప్పనిసరి పరిస్థితుల్లో రిఫరల్ చేయిస్తున్నామని, ఆస్పత్రుల్లో అన్ని యంత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనబంధంగా సర్వజన ఆస్పత్రిని మార్పుచేసే ప్రక్రియపై కళాశాల ప్రిన్సిపాల్తో చర్చించారు. వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేయాలని సూచించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మెడికల్ కళాశాల వద్దకు ఆస్పత్రిని తరలిస్తే ప్రజలకు దూరం అవుతుందని, అటువైపు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కూడా లేదని, కొన్ని విభాగాలను బోధనాస్పత్రి వద్ద ఏర్పాటు చేసి, పాత ఆస్పత్రినే అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
● అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందించాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధికారులను కోరారు. మ్యుటే షన్ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. కొందరు రైతులు ఎరువులు, విత్తనాలు ప్రైవేటు డీలర్ల వద్ద అధిక మొత్తం చెల్లించి కొనుగోలు చేస్తున్నారని, అధిక ధరలకు విక్రయించే వారిపై విజెలెన్స్ అదికారులతో తనిఖీలు చేయించి రైతులకు న్యాయం చేయాలన్నారు.
తాటిపూడి నీటి కోసం ఆందోళన వద్దు
గొర్రిపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి జలాశయం గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎంఎస్ఎంఈ పార్కుకు తాటిపూడి నుంచి నీరందించడంపై ప్రభుత్వ చర్చకు రాలేదని మంత్రి కొండపల్లి స్పష్టంచేశారు. దీనిపై జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తాటిపూడి కేవలం సాగు, తాగునీటి ప్రాజెక్టు అని, జిందాల్ సంస్థ స్వయంగా నీటి వసతులు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
శాసనమండలి సభ్యులు గాదె శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ పాఠశాలలకు కంప్యూటర్ ఆపరేటర్లు లేరని, సచివాలయాల నుంచి డిప్యుటేషన్ వేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉపాధిహామీ పనుల తీర్మానాలపై సభలో చర్చ జరిగింది. గ్రామ సభల్లో తీర్మానించిన వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయకుండా, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల హక్కులు కాలరాస్తున్నారంటూ పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. అధికార బలంతో ఎంపీడీఓలను అడ్డంపెట్టుకుని ఎమ్మెల్యేలు చెప్పిన పనులు చేసుకుంటున్నారని ఆరోపించారు.
విద్యార్థుల తగ్గుదల
ఆందోళన
కలిగించే విషయం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గడం ఆందోళన కలిగించే విషయమని, సంఖ్య తగ్గకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని జెడ్పీ చైర్మన్ కోరారు. ఇటీవల మెరకముడిదాం మండలంలో తనిఖీ చేసినప్పుడు గత ఏడాది కన్నా 1100 మంది తగ్గారని తెలిసిందని, ఒకే మండలంలో ఇంత మంది తగ్గితే జిల్లా అంతటా ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందన్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కోవిద్యార్థి నుంచి కట్ చేసిన రూ.2వేలు పాఠశాలల ఖాతాలకు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు. విద్యార్థుల నమోదు తగ్గుదలపై శాసీ్త్రయంగా విశ్లేషణ జరగాలని, దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలని డీఈఓకు మంత్రి కొండపల్లి సూచించారు. ఈ నెల 10న మెగా టీచర్ పేరెంట్స్ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ లోపల అడ్మిషన్లు పూర్తిచేస్తామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు.

ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం