
భలే మందుల వ్యాపారం..!
● ఆ ఫార్మా కంపెనీ మందులే రాయాలంటూ హుకుం!
● ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల వైద్యులకు సంబంధిత ఉన్నతాధికారి ఫోన్లో
ఆదేశాలు
● ఆ ఫార్మా కంపెనీ కూటమికి చెందిన ఓ ముఖ్యనేతది కావడం గమనార్హం!
● నాసిరకం మందుల అమ్మకాలతో దోపిడీ ప్రయత్నాలు
● రోగుల ఆరోగ్యంతో వ్యాపారం
● తమపై ఇదేమి రుబాబు అంటున్న
నెట్వర్క్ ఆస్పత్రుల వైద్యులు
● జిల్లాలో 25 ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు
విజయనగరం ఫోర్ట్: కూటమి నేతలు ప్రజాసంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని పక్కనపెట్టేసి ప్రజలను దోచుకునే పనిలోపడ్డారు. ఇసుక, మద్యం బెల్టు దుకాణాల నుంచి రోగుల ఆరోగ్యాన్ని కుదుటపర్చే మందుల వరకు అన్నింటినీ వ్యాపారంగా మార్చేస్తున్నారన్నది జనం మాట. తాజాగా జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఫోన్లో అందిన మౌఖిక ఆదేశాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఆరోగ్యశ్రీ రోగుల చికిత్సకు అవసరమయ్యే అన్నిరకాల మందులు కూటమి నేత కంపెనీకి చెందినవే వినియోగించాలని ఆదేశించినట్టు సమాచారం. మా కంపెనీ మందులు కాదని ఇతర కంపెనీల దగ్గర కొనుగోలు చేసేందుకు వీలులేదని తేల్చిచెప్పినట్టు తెలిసింది. ఇది వైద్యవర్గాలతో పాటు మిగిలిన మందుల కంపెనీల యాజమాన్యాలను కలవరపెడుతోంది.
పారాసిట్మల్ నుంచి యాంటీ
బయోటిక్ వరకు...
జ్వరం తగ్గేందుకు ఉపయోగించే పారాసిట్మాల్ మాత్రల దగ్గర నుంచి తలనొప్పి, ఐ డ్రాప్స్, ఇయర్ డ్రాప్స్, యాంటీ బయోటిక్స్, కడుపు నొప్పి, గ్యాస్టిక్ మాత్రలు, ప్రోటీన్ పౌడర్లు, విటమిన్, బి–కాంప్లెక్సు మాత్రలు, పలు రకాల ఇంజిక్షన్లు, సర్జికల్ మెటిరీయల్స్ ఇలా అన్నిరకాల మందులు ఆ ఒక్క కంపెనీ వద్దనే కొనుగోలుచేయాలని నెట్వర్క్ ఆస్పత్రులకు ఆదేశాలు అందాయి. ఆరోగ్యశ్రీకి చెందిన ఉన్నతాధికారుల నుంచి ఫోన్ రావడంతో నెట్వర్క్ ఆస్పత్రులు సంబంధిత ఫార్మా కంపెనీ చెప్పిన మందులు కొనుగోలు చేయకపోతే ఏమవుతుందోనని మదనపడుతున్నారు. వారు చెప్పినట్టు చేయకపోతే ఆరోగ్యశ్రీ రోగులకు సంబంధించిన బిల్లులు నిలిపివేస్తారేమోనని భయపడుతున్నారు. మరోవైపు నాణ్యతలేని మందులు రాస్తే రోగులు ఎలా కోలుకుంటారని మదనపడుతున్నారు.
ఆ కంపెనీ కూటమి నేతదే..
ఫార్మా కంపెనీ కూటమికి చెందిన ఓ ముఖ్య నేతది. దీంతో సదరు నేత ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి జిల్లాకు చెందిన ఆరోగ్యశ్రీ అధికారుల ద్వారా నెట్వర్క్ ఆస్పత్రులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. విజయనగరం జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలోనూ ఇదే విధంగా నెట్వర్క్ ఆస్పత్రులపై ఒత్తిడి తెస్తున్నట్టు వైద్యవర్గాల్లో చర్చసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా బలవంతంగా కూటమి నేతలు రుబాబు చేయడం పట్ల నెట్వర్క్ ఆస్పత్రుల యాజమానులు ఆవేదన చెందుతున్నారు.
‘విజయనగరంలో ఉన్న ఓ ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) నెట్వర్క్ ఆస్పత్రికి ఆరోగ్యశ్రీకి చెందిన ఓ ఉన్నతాధికారి ఫోన్చేసి ఫార్మా కంపెనీకి చెందిన ప్రతినిధి వస్తారు. వారి కంపెనీకి చెందిన మందులే తీసుకోవాలి. రోగులకు వాటినే అందజేయాలి అని ఫోన్లో ఆదేశించారు. ఈ ఫోన్ వచ్చిన అర గంటలో సంబంధిత ఫార్మా కంపెనీ ప్రతినిధి, జిల్లాకు చెందిన ఆరోగ్యశ్రీ సిబ్బందిని వెంట బెట్టుకుని ఆస్పత్రికి వెళ్లి మా ఫార్మా కంపెనీలో తయారు చేసిన మందులను ఆరోగ్యశ్రీ రోగులకు ఇవ్వాలని చెప్పారు. చేసేది లేక సంబంధిత ఆస్పత్రి వైద్యులు మిన్నుకుండి పోయారు. నాసిరకం, డొల్ల కంపెనీ మందులు రాయాలన్న ఒత్తిడిపై ఇదేమి రుబాబు అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.’
భారీ దోపిడీకి కూటమి నేత స్కెచ్ వేశారు. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం కింద అధిక శాతం మంది శస్త్రచికిత్సలు, చికిత్స తీసుకుంటారు. జిల్లాలోని 25 ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఏడాదికి 60 వేల నుంచి 80 వేల మంది వరకు సేవలు పొందుతారు. వీరికి మందుల కోసం నెట్వర్క్ ఆస్పత్రులు కోట్లాది రుపాయలు వెచ్చిస్తాయి. ఆ మేరకు నెట్వర్క్ ఆస్పత్రులకు నాణ్యతలేని మందులు సరఫరా చేయడం ద్వారా ఏడాదికి రూ.60 కోట్ల నుంచి రూ. 80కోట్ల వరకు ఆర్జించవచ్చన్నదే కూటమినేత స్కెచ్ అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సంబంధిత ఫార్మా కంపెనీ నుంచి నెట్వర్క్ ఆస్పత్రులకు మందుల సరఫరాకు అంతా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇప్పటివరకు నెట్వర్క్ ఆస్పత్రులు వారి ఆస్పత్రుల్లో అందించే వ్యాధులకు సంబంధించి అవసరమైన మందులను వారికి నచ్చిన ఫార్మా కంపెనీల నుంచి తెప్పించుకునేవారు. ఇకపై కూటమి నేతఫార్మా కంపెనీ నుంచి తెప్పించుకోవాల్సిందే.
వాస్తవమే...
ఫార్మా కంపెనీకి చెందిన ప్రతినిధి నెట్వర్క్ ఆస్పత్రులకు వచ్చిన మాట వాస్తవమే. వారి కంపెనీకి చెందిన మందులను తీసుకోవాలని కోరారు. బలవంతం పెట్టలేదు. – డాక్టర్ కుప్పిలి సాయిరాం,
ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్

భలే మందుల వ్యాపారం..!

భలే మందుల వ్యాపారం..!