తాటిచెట్లపాలెం: దేశంలోని యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనే ప్రధాని మోదీ ఆశయమని, దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా సోమవారం 8వ రోజ్గార్ మేళా నిర్వహించి, అర్హులైన అభ్యర్థులకు నేరుగా నియామకపత్రాలు అందజేశామని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా తెలిపారు. సోమవారం సాలగ్రామపురంలోని పోర్టు సాగరమాల కన్వెన్షన్లో జరిగిన రోజ్గార్ మేళాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ రోజ్గార్ మేళా ప్రారంభించి, ఇప్పటి వరకు సుమారు 5 లక్షల మందికి పైగా వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు కల్పించారన్నారు. సోమవారం వర్చువల్గా మరో 51 వేల మందికి నియామకపత్రాలు దేశ వ్యాప్తంగా 45 ప్రాంతాల్లో అందజేశామని తెలిపారు. విశాఖలో జరిగిన ఈ మేళాలో కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ పరిఽధిలోని పీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, సీఎపీఎఫ్, అస్సాం రైఫిల్స్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎన్సీబీ, ఢిల్లీ పోలీస్ వంటి విభాగాల్లో కానిస్టేబుల్స్( జనరల్ డ్యూటీ), సబ్ ఇన్స్పెక్టర్ (జనరల్ డ్యూటీ), నాన్ జనరల్ డ్యూటీ కేడర్లలో ఉద్యోగాలు పొందిన సుమారు 650 మందిలో 25 మందికి మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ మాట్లాడుతూ 2024 మే నెలాఖరు నాటికి 10 లక్షల ఉద్యోగాలు మోదీ ప్రభుత్వం ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విశాఖపట్నం పోర్టు అఽథారిటీ సెక్రటరీ టి.వేణుగోపాల్, సీఐఎస్ఎఫ్ దక్షిణ జోన్ డీఐజీ మాలేటి నందన్, ఆయా విభాగాలకు చెందిన అఽధికారులు పాల్గొన్నారు.
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా