
● రేణిగుంట ఎయిర్పోర్టు సమీపంలో రూ.60 కోట్ల భూమి కబ్జా
కనిపించని హెచ్చరిక బోర్డు
ప్రభుత్వ భూమి పరిరక్షణకు రెవెన్యూ అధికారులు తూతూమంత్రంగా చర్యలు చేపడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు నెల నుంచి ఈ భూమిని కబ్జా చేసేందుకు కొందరు యత్నిస్తున్నప్పటికీ ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేయలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ప్రధాన నేతల అండదండలతోనే కబ్జాదారులు చెలరేగిపోతున్నట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ భూమికి కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
రేణిగుంట విమానాశ్రయం రహదారిలో ప్రభుత్వ భూమి భూమిలో జెసిబి లు హల్ చల్
రేణిగుంట: మండలంలోని కొత్తపాళెం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 99లో ఉన్న 5.33 ఎకరాల ప్రభుత్వ భూమిని తమదే అంటూ కొందరు అధికార పార్టీ నేతలు సుమారు నెల రోజులుగా నానా యాగీ చేస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి సమీపంలో సుమారు రూ.60 కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిని ఆదివారం ఉదయం 9 జేసీబీలు, 20 ట్రాక్టర్లతో చదును చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై సమాచారం అందుకుని తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి తమ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ఇది ప్రభు త్వ భూమి అని మరోసారి ఆక్రమణకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రంగంలోకి బినామీ
కబ్జా యత్నం వికటించే సరికి టీడీపీ నేతలు వెంటనే బినామీని రంగ ప్రవేశం చేయించారు. కొత్తపాళెం దళితవాడుకు చెందిన మరియమ్మతో సదరు 5.33 ఎకరాలకు లీజు పట్టా ఉందని అధికారులకు చెప్పించారు. గతంలో ఇది ప్రభుత్వ భూమి అని రెవెన్యూ సిబ్బంది చెప్పడంతో హైకోర్టును ఆశ్రయించామని, తమకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని హడావుడి చేశారు. అయితే మరియమ్మ వెనుక టీడీపీ నేతలు ఉన్నారని, రూ.కోట్ల విలువైన భూమిని కాసేందుకు దళితురాలిని ముందుపెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆమెకు ఎంతో కొంత ముట్టజెపుతామని ఆశపెట్టి బినామీగా మార్చుకున్నారని స్పష్టం చేస్తున్నారు.
మీడియాపై దౌర్జన్యం
ప్రభుత్వ భూమి కబ్జాను రెవెన్యూ అధికారులు అడ్డుకుని, జేసీబీలు, ట్రాక్టర్లను పంపించే దృశ్యాలను చిత్రీకరిస్తున్న విలేకరులపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. మా భూమిలోకి వచ్చి ఫొటోలు ఎలా తీస్తారంటూ వాగ్వాదానికి దిగారు. ఇది ప్రభుత్వ భూమి అని అధికారులు చెబుతున్నారు కదా అని ప్రశ్నించిన వారిపై దాడికి సైతం యత్నించారు.
టీడీపీ నేతల అండతోనే..
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిగా చెరువుల ఆక్రమణ పెరిగిపోయింది. టీడీపీ నేతల అండతోనే కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఎర్రమరెడ్డి పాళెం చెరువులో దేవాలయం, కల్యాణమండపం నిర్మిస్తున్నామంటూ టీడీపీ లక్ష్మీపురం ఇన్చార్జి రమేష్, సీఆర్ఎస్లో పనిచేసే అంకయ్య కబ్జాకు యత్నించారు. స్థానికుల రైతులతో కలిసి ఆక్రమణను అడ్డుకున్నాం. – హేమలత,
ప్రధాన కార్యదర్శి, రైతు సంఘం
కబ్జాలపై కఠిన చర్యలు
ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కొత్తపాళెంలోని 5.33 ఎకరాలు ప్రభుత్వ భూమి, ఇది కలెక్టర్ సైతం నిర్ధారించారు. ఇందులోకి ఎవరు ప్రవేశించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అలాగే చెరువుల ఆక్రమణలను సహించే ప్ర సక్తే లేదు.– చంద్రశేఖర్రెడ్డి, తహసీల్దార్, రేణిగుంట
దేవాలయం పేరుతో చెరువు స్వాహా
తూకివాకం పంచాయతీలోని ఎర్రమరెడ్డిపాళెం చెరువును సైతం స్వాహా చేసేందుకు టీడీపీ నేతలు ప్రణాళిక రచించారు. ఇప్పటికే చెరువులో కొంత భాగం చదును చేయించేశారు. ఆ స్థలంలో దేవాలయం నిర్మిస్తామని స్థానికులను మభ్య పెట్టేందుకు యత్నించారు. అయితే రైతు సంఘం నేత హేమలత ఆధ్వర్యంలో ఆయకట్టు రైతులు ఈ ఆక్రమణకు అడ్డుపడ్డారు. తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, ఆర్ఐ జయకృష్ణ పర్యవేక్షణలో చెరువులో టీడీపీ నేతలు వేయించిన ఫెన్సింగ్ను తొలగించారు. మరెవరు ఆ స్థలంలోకి ప్రవేశించకుండా ట్రెంచ్ తవ్వించారు. అయితే ఆక్రమణకు గురైన ప్రాంతం తిరుపతి రూరల్ మండలానికి చెందినగా రెవెన్యూ అధికారులు గుర్తించడంతో ఈ మేరకు సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించారు. ఈ స్థలంలో రెండు మండలాల సర్వేయర్లతో సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయిస్తామని తహసీల్దార్ స్పష్టం చేశారు.

● రేణిగుంట ఎయిర్పోర్టు సమీపంలో రూ.60 కోట్ల భూమి కబ్జా

● రేణిగుంట ఎయిర్పోర్టు సమీపంలో రూ.60 కోట్ల భూమి కబ్జా