
ట్రాన్స్కో పనుల అడ్డగింత
తడ: ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలోని పరిశ్రమల అవసరాలకు మాంబట్టు సెజ్ పరిధిలో చిన్న మాంబట్టు దళితవాడకు ఎగువన ఏపీ ట్రాన్స్కో ఏర్పాటు చేసే 130–కేవీ సబ్ సస్టేన్ పనులను శనివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పనులు చేయడం భావ్యం కాదన్నారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు, గ్రామ ప్రజాపత్రినిధులకు తెలపకుండా చదును చేసే ప్రయత్నం మానుకోవాలని కోరారు. పారిశ్రామిక అవసరాల కోసం ఏర్పాటు చేసే సబ్ స్టేషన్ కోసం గ్రామ అవసరాలకు పనికి వచ్చే స్థలాన్ని ఎంపిక చేయడం ఏమిటని నిలదీశారు. గత ప్రభుత్వంలో సబ్స్టేషన్ నిర్మాణం కోసం వేరొక ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు గ్రమావసరాలకు పనికొచ్చే స్థలంలో సబ్స్టేషన్ నిర్మిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ట్రాన్స్కో డీఈ బలరామ్మూర్తి స్పందిస్తూ ఏవైనా అభ్యంతరాలుంటే రెవెన్యూ అధికారులకు తెలపాలని సూచించారు. ఎస్ఐ కొండపనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. అభ్యంతరాలను సోమ వారం రెవెన్యూ అధికారులకు తెలిపి అక్కడి నుంచి వేరొక చోటుకు మార్పు చేసుకోవాలని చెప్పారు. సర్పంచ్ రమణయ్య, ఎంపీటీసీ శ్రీపతిబాబు, ట్రాన్స్కో ఏఈ ప్రవీణ్, ఏడీఈ సురేష్, తడ ఏఈ మురళి ఉన్నారు.