ధర్నాలతో హోరెత్తిన కలెక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

ధర్నాలతో హోరెత్తిన కలెక్టరేట్‌

May 27 2025 1:57 AM | Updated on May 27 2025 1:57 AM

ధర్నా

ధర్నాలతో హోరెత్తిన కలెక్టరేట్‌

తిరుపతి అర్బన్‌: వివిధ సమస్యలపై తిరుపతి కలెక్టరేట్‌ ధర్నాలలో హోరెత్తింది. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లాలోని పలు ప్రాంతాల అర్జీదారుల నుంచి ఉన్నతాధికారులు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, జాయింట్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌, డీఆర్వో నరసింహులు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, శివశంకర్‌ నాయక్‌, రోజ్‌మాండ్‌, సుధారాణి, ఇతర అధికారులు వినతులు స్వీకరించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 268 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూ సమస్యలపై 150 ఉండటం గమనార్హం! అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

చంద్రగిరిలో మట్టి దోపిడీ

చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారని, దీనికి చెక్‌ పెట్టాలని సీపీఎం, సీఐటీయూ నేతలు డిమాండ్‌ చేశారు. ప్రధానంగా చంద్రగిరి ప్రభుత్వ బాలుర హాస్టల్‌ వద్ద మట్టిని తవ్వి వందల ట్రిప్పులు తరలిస్తున్నారని, అలాగే రామచంద్రాపురం మండలంలో రామాపురం నుంచి పచ్చికాపల్లం రోడ్డు మార్గంలో కొండలన్నీ తవ్వి ఎర్రమట్టిని తరలిస్తున్నారని, ఒక్కో ఎర్రమట్టి ట్రిప్పు రూ.30వేలకు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.

ఆటోడ్రైవర్‌ భాగ్యశ్రీకి

పింఛను మంజూరు చేయాలి

మంగళం అంబేడ్కర్‌ కాలనీకి చెందిన ఒంటరి మహిళ, ఆటో డ్రైవరైన భాగ్యశ్రీపై గత నెల 27న ఓ వర్గానికి చెందిన కొందరు దాడులు చేయడంతో ఆమె మంచానికే పరిమితమయ్యారని...ఆమెకు పింఛను మంజూరు చేసి న్యాయం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి కోరారు.

గ్రీవెన్స్‌కు సమస్యల వెల్లువ

విశాఖ ఉక్కును రక్షించుకుందాం

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోవడానికి సమష్టిగా కృషి చేద్దామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఏఐటీయూసీ నగర కార్యదర్శి రాజా, ఐఎఫ్‌టీయూ కార్యదర్శి లోకేష్‌ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌ వద్ద చేసిన ధర్నాలో వారు మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న వారిలో 4వేల మందిని తొలగించడం తగదని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, విశాఖ ఉక్కు కోసం 32 మంది ప్రాణాలు త్యాగం చేశారన్నారు. ఆ సమయంలో 60 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు సైతం రాజీనామా చేశారని తెలియజేశారు. ఇంతటి చరిత్ర కలిగిన ఫ్యాక్టరీ ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అనంతరం కలెక్టర్‌కు ఓ వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు హరినాథ్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బాలసుబ్రమణ్యం, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు వెంకటరత్నం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, ఐద్వా జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సుమన్‌, ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎస్టీ వర్గీకరణ కోసం పోరుబాట

ఎస్సీ వర్గీకరణ తరహాలో ఎస్టీ వర్గీకరణ చేయాలని యానాది రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య యానాది డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ వద్ద పోరుబాట పేరిట ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 10లక్షల మంది యానాదాలు ఉన్నారని, గిరిజనుల్లో జనాభా ప్రకారం మొదటి స్థానంలో యానాదులు ఉన్నప్పటికీ అన్నింటా తమకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని, ఎస్టీ వర్గీకరణ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. యానాది సంఘం నేతలు చేవూరు సుబ్బారావు, బాపట్ల బ్రహ్మయ్య, తలపల మల్లికార్జున, యల్లంపాటి వెంకటరమణ, అత్తూరు చెంగల్‌ రాయులు, శ్రీమంతుల రామయ్య, రేవతి, రాములమ్మ, చెంబేటీ ఉష తదితరులు పాల్గొన్నారు.

ధర్నాలతో హోరెత్తిన కలెక్టరేట్‌1
1/1

ధర్నాలతో హోరెత్తిన కలెక్టరేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement