
చెరువులో పడి వ్యక్తి మృతి
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్రపాకం చెరువులో గురువారం ఉదయం ఓ వ్యక్తి మృత దేహం బయటపడింది. అది తవణంపల్లికి చెందిన మునిరత్నం (40)దిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద వశాత్తు చెరువులో పడి చనిపోయాడా.. మద్యం మత్తులో పడ్డాడా..? కుటుంబ కలహాలతో తనే ఆత్మహత్య చేసుకున్నాడా..? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మునిరత్నం చెరువు కట్టమీద ఉన్న ఓ బండపై కూర్చుని అతిగా మద్యం సేవించి ఇంటికి వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తిరుచానూరు సీఐ సునీల్కుమార్ తెలిపారు.
తిరుమలలో తనిఖీలు
తిరుమల: శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న కొబ్బరికాయల విక్రయకేంద్రం, టీటీడీ ప్రచురణల విక్రయ కేంద్రం, డాలర్ల విక్రయ కేంద్రాలను గురువారం ఉదయం టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు. ముందుగా అఖిలాండం వద్ద ఉన్న కొబ్బరికాయలు విక్రయ కేంద్రంలో తనిఖీలు చేసి కొబ్బరి కాయల సైజును పరిశీలించారు. అనంతరం టీటీడీ ప్రచురణల విక్రయ కేంద్రానికి చేరుకున్న ఆయన అక్కడ స్టాక్ను పరిశీలించారు. టీటీడీ డాలర్ల విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేశారు. వీజీవో సురేంద్ర పాల్గొన్నారు.
ఈతకు వెళ్లి యువకుడి మృతి
చిట్టమూరు: మండల పరిధిలోని పల్లంపర్తి గ్రామంలో గురువారం సరదాగా ఈతకు వెళ్లి బట్టా నవీన్(20) అనే యువకుడు మృతిచెందాడు. స్థానికుల కథనం.. గ్రామానికి చెందిన బట్టా మస్తానయ్య, రాజేశ్వరి దంతుల కుమారుడు బట్టా నవీన్. ఇంటర్మీడియెట్ వరకు చదివి శ్రీసిటీలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. మేడే సెలవు కావడంతో ఇంటి వద్దనే ఉండగా.. మధ్యాహ్నం తన స్నేహితుడితో కలసి గ్రామం పక్కనే ఉన్న గుంటలో ఈత కొట్టేందుకు బురదలో కూరుకుపోయాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో.. గ్రామస్తులు అతి కష్టం మీద నవీన్ మృతదేహాన్ని బయటకు తీశారు. చేతికొచ్చిన కొడుకు దూరమవ్వడంతో కన్నీరుమున్నీరుగా విలపించడం కలచివేసింది.

చెరువులో పడి వ్యక్తి మృతి

చెరువులో పడి వ్యక్తి మృతి