హైదరాబాద్: తెలంగాణ పోలీసులకు హ్యాకింగ్ ముఠాలు షాకిచ్చాయి. ఇటీవలే హైకోర్టు వెబ్సైట్ను హ్యాక్ చేసిన ఈ ముఠాలు.. తాజాగా సైబరాబాద్ మరియు రాచకొండ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్లను కూడా టార్గెట్ చేశాయి. దీనివల్ల గత పది రోజులుగా ఈ వెబ్సైట్లు పూర్తిగా పనిచేయకుండా పోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
వెబ్సైట్లలోని లింకులు ఓపెన్ చేస్తే, అధికారిక సమాచారానికి బదులుగా బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ అవుతున్నాయని పలువురు గమనించడంతో విషయం తీవ్రతరం అయింది. వెంటనే IT విభాగం ఈ రెండు సైట్లను డౌన్ చేసి సర్వర్లు సురక్షితంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్సైట్ల నిర్వహణ బాధ్యతలు చూసే NIC (National Informatics Centre) అలర్ట్ అయ్యింది.
హ్యాకింగ్కు కారణమైన ముఠాలను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులతో సమన్వయం చేస్తూ సర్వర్ల భద్రతను బలోపేతం చేసే పనిలో నిమగ్నమైంది. సైబర్ దాడులు వరుసగా జరుగుతుండటంతో ప్రభుత్వ విభాగాల్లో సైబర్ భద్రతపై కొత్త చర్చ మొదలైంది. అధికార వర్గాలు మాత్రం త్వరలోనే వెబ్సైట్లను పునరుద్ధరిస్తామని, భవిష్యత్లో ఇలాంటి దాడులు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని వెల్లడిస్తున్నాయి.


