
ఇకపై ఆట మొదలవుతుంది
తమిళసినిమా: ప్రేక్షకులను విపరీతంగా అలరించే రంగాల్లో ఒకటి సినిమా, రెండోది క్రికెట్ క్రీడ. కాగా ఇప్పుడు క్రికెట్ క్రీడలో పాపులర్ అయిన క్రీడాకారుల్లో కొందరి చూపు సినిమాలపై పడుతోంది. అలా ఇప్పటికే చటగోపన్ రమేష్, హరిభజన్ సింగ్, బ్రావో, శ్రీకాంత్, ఇర్ఫాన్ పటాన్ తదితరులు సినిమాల్లో నటించారు. ఇక ఎంఎస్ ధోని ఏకంగా నిర్మాతగా మారి ఎల్జీఎం అనే చిత్రాన్ని తమిళంలో నిర్మించారు. కాగా తాజాగా మరో ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు, ఇండియన్ క్రికెట్ జట్టులో ప్రముఖుడు, చైన్నె సూపర్ కింగ్స్ జట్టులోనూ ముఖ్య క్రికెట్ క్రీడాకారుడు సురేష్రైనా హీరోగా పరిచయం కానున్నారు. అదీ తమిళ చిత్రంలోనే కావడం విశేషం. ఈ చిత్రం రెట్టతలై చిత్రం ఫేమ్ లోగన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ నైట్ స్టోరీస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై టీ.శరవణకుమార్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన బ్యానర్, లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు. ఇందులో యువ క్రికెట్ క్రీడాకారుడు శివం దుబే ముఖ అతితిగా పాల్గొని, చిత్రం లోగోను ఆవిష్కరించి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఇది క్రికెట్ క్రీడ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి ఆంస్టర్డామ్లో విహార యాత్రలో ఉన్న సురేష్రైనా వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ సినిమా అంటే తనకు చాలా ఇష్టం అన్నారు. ఇప్పుడు సినిమాలో కథానాయకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు. తమిళనాడు తనకు చాలా నచ్చిన రాష్ట్రం అన్నారు. ఇక్కడ చాలా అద్భుతాలు చూశానన్నారు. కాగా తమిళ చిత్రంలో నటించనుండడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. ఇకపైనే ఆట ప్రారంభం అవుతుందననే అభిప్రాయాన్ని సినిమా హీరోగా పరిచయం కానున్న క్రికెట్ క్రీడాకారుడు సురేష్ రైనా పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో ఎడిటర్ మోహన్ తన సతీమణి, కొడుకు, దర్శకుడు మోహన్రాజాతో పాల్గొన్ని యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా పలువురు సినీ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.
క్రికెట్ క్రీడాకారుడు సురేష్ రైనా
క్రికెట్ క్రీడాకారుడు శివం దుబేతో చిత్రం యూనిట్