
అభివృద్ధి చేస్తాం
అండగా ఉంటాం..
హుస్నాబాద్లో ప్రగతిని పరుగులు పెట్టిస్తాం
‘గౌరవెల్లి’పై గత ప్రభుత్వం
నిర్లక్ష్యం: మంత్రి కోమటి రెడ్డి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్టను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రూ.77కోట్లతో హుస్నాబాద్ నుంచి సుందరిగిరి వరకు నాలుగు వరసల రోడ్డు ఫేజ్ టూ కింద రెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. సుందరగిరి నుంచి కొత్తపల్లి వరకు రూ.80 కోట్లతో నాలుగు వరుసల రహదారి వారం రోజుల్లో మంజూరు అవుతుందని అన్నారు. గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కోసం సీఎంతో మాట్లాడామన్నారు. ఫారెస్ట్ అనుమతులు పూర్తి అయ్యాయని, కాలువల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
హుస్నాబాద్: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని, ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంత్రులు దామోదర, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం రూ.11.50కోట్లతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ ఆరోగ్యం కేంద్రం ప్రారంభం, రూ.82 కోట్లతో 150 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన, రూ.72.20 కోట్లతో హుస్నాబాద్ నుంచి కొత్త పల్లి వరకు (ఫేజ్–2) నాలుగు లేన్ల రోడ్ల నిర్మాణానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులు కలిసి శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ఇదే మొదటి సారి.
విద్య, ఆరోగ్యంతోనే సమాజంలో మార్పు
ఆరోగ్య తెలంగాణ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో దామోదర మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే విద్య, ఆరోగ్యం, నైపుణ్యం అవసరమన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ వల్లే హుస్నాబాద్కు ఇంజనీరింగ్ కళాశాల వచ్చిందన్నారు. హుస్నాబాద్ 250 పడకల ఆస్పత్రికి 50 సీట్లతో పీజీ మెడికల్ కళాశాలను మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఎంబీబీఎస్ కాదని పీజీ చదువుకునే డాక్టర్లు ఇక్కడికి వస్తారని ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రతి నియోజకవరానికి ఒక నర్సింగ్ కళాశాల అవసరమన్నారు.
త్వరలో నాలుగు లేన్ల రోడ్డు: మంత్రి పొన్నం
అక్కన్నపేట నుంచి జనగామ వరకు నాలుగు లేన్ల రోడ్డు త్వరలో వస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంలో ఇంజనీరింగ్ కళాశాల ఈ ఏడాది నుంచే ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇక్కడికి వచ్చిన మంత్రులు హుస్నాబాద్ అభివృద్దికి అభయం ఇవ్వాలని కోరారు. మూడు జిల్లాల కలెక్టర్లు కలిసి గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల పనుల సర్వే చేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు రూ.71.30 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. హుస్నాబాద్లో గోడౌన్లు నిర్మించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు, సుందరగిరి నుంచి కొత్తపల్లి వరకు ఫేజ్ వన్ నాలుగు వరుసల రహదారిని మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డికి మంత్రి పొన్నం వినతి పత్రాలు ఇచ్చారు.
పొన్నంను పొగడ్తలతో ముంచెత్తిన మంత్రులు
మంత్రి పొన్నంపై సహచర మంత్రులు ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రుల మాటలు ఇలా.. ‘పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమకారుడు. చాలా యాక్టివ్ మంత్రి. ఎప్పుడూ హుస్నాబాద్ కోసం పరితపిస్తుంటారు. ఉదయం హైదరాబాద్లో ఉంటే సాయంత్రం హుస్నాబాద్లో ఉంటారు. హుస్నాబాద్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేవి చాలా ఉన్నాయి. మేమంతా అండగా ఉంటాం. అభివృద్ధి చేస్తాం. రాబోయే మూడున్నరేళ్లలో పొన్నం అడిగిన పనులు పూర్తి అవుతాయి’ అని అన్నారు.
ప్రతీ జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ: తుమ్మల
50 పడకల పీజీ మెడికల్ కళాశాల: మంత్రి దామోదర
త్వరలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తాం: మంత్రి తుమ్మల
పది రోజుల్లో నాలుగు లేన్ల రహదారి మంజూరు: మంత్రి వెంకట్రెడ్డి
పెద్ద ఎత్తున అభివృద్ధిపనులకు శ్రీకారం
శ్రీరాంసాగర్, వరద కాలువలతో అన్నపూర్ణ జిల్లా కరీంనగర్ జిల్లా ప్రసిద్ధి చెందుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఎన్నో ప్రాజెక్టులు ఉన్న కరీంనగర్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వచ్చానన్నారు. నర్మేటలో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరిని త్వరలో సీఎం ప్రారంభిస్తామన్నారు. నాలుగైదు జిల్లాలకు ఈ ఫ్యాక్టరి ఉపయోగపడుతుందన్నారు. ప్రతి జిల్లాలో ఆ యిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆయిల్పామ్ సాగుకు నష్టం ఉండదని, స్థిరత్వమైన ధర కల్పిస్తామన్నారు.

అభివృద్ధి చేస్తాం