
ప్రార్థనా మందిరాలతో ప్రశాంతత
మొయినాబాద్రూరల్: ప్రార్థనా మందిరాలు మానవుడికి మనశ్శాంతిని కలిగిస్తాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు కొంపల్లి అనంతరెడ్డిలు పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్లో నూతనంగా నిర్మించిన మెథడిస్ట్ చర్చి ప్రార్థనలను బిషప్ ఏ.సిమోయిన్ నిర్వహించగా ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి, రత్నం, అనంతరెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో పాటు మంచి అలవాట్లతో ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భాస్కర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రకాష్, ఎస్టీఎఫ్ అధ్యక్షుడు పోచయ్య, అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవియాదవ్, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఇన్చార్జి భీంభరత్, నాయకులు శేఖర్, శ్యామ్రావు తదితరులు పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం రూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరేసుకుని మృతిచెందాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ సోమయ్య కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా తిరుమలగిరికి చెందిన రంగబాబు(40) తన భార్య, కుమారుడితో కలిసి తుర్కయంజాల్లోని లక్ష్మీ గార్డెన్లో నివాసం ఉండేవాడు. గత కొద్ది రోజులుగా ఏ పనీ చేయకుండా ఉంటున్న రంగబాబు మద్యం, కల్లుకు బానిసయ్యాడు. శుక్రవారం ఉదయాన్నే భార్య ఎప్పటిలాగే ఇళ్లల్లో పనిచేసేందుకు వెళ్లగా, కుమారుడు ఇంట్లో లేడు. పనిముగించుకున్న అనంతరం ఉదయం 10:30 గంటలకు భార్య ఇంటికి చేరుకోగా రంగబాబు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిదపారు.
తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి దుర్మరణం
ఇబ్రహీంపట్నం: ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోల్కంపల్లికి చెందిన గుండ్ల జంగయ్య (56) కల్లు గీసేందుకు తాటి చెట్టి ఎక్కి, మోకు జారి పోవడంతో కింద పడ్డాడు. తలతో పాటు శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.