అయ్యప్పా.. ఒకటే ట్రిప్పా? | - | Sakshi
Sakshi News home page

అయ్యప్పా.. ఒకటే ట్రిప్పా?

Dec 4 2025 9:09 AM | Updated on Dec 4 2025 9:09 AM

అయ్యప్పా.. ఒకటే ట్రిప్పా?

అయ్యప్పా.. ఒకటే ట్రిప్పా?

నాందేడ్‌– కొల్లాం ప్రత్యేక రైలు దిగువకే హాల్టింగ్‌ ప్రత్యేక రైలులోనూ ఇంటికి వచ్చేందుకే అవకాశం శబరిమల వెళ్లేందుకు కేరళ ఎక్స్‌ప్రెస్‌లో దొరకని సీట్లు ఉమ్మడి జిల్లా అయ్యప్ప భక్తుల తీవ్ర అసహనం ముగ్గురు ఎంపీలు జోక్యం చేసుకోవాలని వినతి

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: ఉమ్మడి జిల్లా అయ్యప్ప భక్తులకు ప్రత్యేక రైలు విషయంలో తీవ్ర నిరాశ ఎదురవుతోంది. నాందేడ్‌ నుంచి కొల్లాం శబరిమల ప్రత్యేక రైలు ఒక ట్రిప్‌ అది కూడా దిగువమార్గంలో వయా కరీంనగర్‌– పెద్దపల్లి మార్గంలో ఏటా నడిపిస్తున్నారు. ఈ రైలు ఉమ్మడి జిల్లాలోని అయ్యప్ప స్వాములకు, భక్తులకు సరిపోవడం లేదు. ముఖ్యంగా మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జమ్మికుంట నుంచి శబరిమలకి వెళ్లే భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు. ప్రస్తుతం ఈ నెల మొత్తం, వచ్చే నెల 15 (సంక్రాంతి ) మకరజ్యోతి వరకు శబరిమల సన్నిధానం తెరచి ఉంటుంది. ఈ మాసంలో ఉమ్మడి జిల్లా నుంచి అధిక సంఖ్యలో భక్తులు, అయ్యప్ప మాలధారులు శబరిమల దర్శనానికి వెళ్తుంటారు. వీరికి అందుబాటులో ఉండేది రైలుమార్గమే. ఇందుకు తగినన్ని రైళ్లు మన ఉమ్మడి జిల్లా నుంచి లేవు. రామగుండంలో ప్రతి రోజు నిలిచే 12626 కేరళ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండు నెలల ముందు రిజర్వేషన్‌ చేసుకున్న కూడా కన్ఫర్మ్‌ కానీ పరిస్థితి ఉంటుంది. ఇది దేశంలో అత్యంత దూరం నడిచే రైళ్లలో ఒకటి. 16318 హిమసాగర్‌ వీక్లీ ఎక్స్‌ ప్రెస్‌, 22647 కోర్బా బై వీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల నుంచి కొల్లాం లేక కొట్టాయం వరకు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీలోని కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, విశాఖపట్నం, చర్లపల్లి, కాజీపేట, వికారాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ మార్గాల్లో 10 ట్రిప్పులు ఎగువ, దిగువ మార్గాల్లో నడిపిస్తుంటే, కరీంనగర్‌ నుంచి ప్రతి ఏటా తూతూ మంత్రంగా ఒకట్రిప్‌ వేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి ఒక ట్రిప్‌ కూడా వెళ్లడం లేదు. ఈ నిర్లక్ష్య వైఖరిపై శబరిమల వెళ్లే ఉమ్మడి జిల్లాలోని అయ్యప్ప భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ముగ్గురు ఎంపీలు చొరవ తీసుకోవాలి

ఏటా వేలాదిమంది భక్తులు ఉమ్మడి జిల్లా నుంచి శబరిమలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో నాందేడ్‌ నుండి కొల్లాం శబరిమల ప్రత్యేక రైలులో దిగువ మార్గంలోనే అవకాశం కల్పించడంపై భక్తులు మండిపడుతున్నారు. తక్షణమే కరీంనగర్‌ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవ తీసుకొని నాందేడ్‌ నుంచి కొల్లాం శబరిమల ప్రత్యేక రైళ్ల సర్వీసులను కనీసం ఎగువతోపాటు దిగువ మార్గాల్లో మొత్తంగా 8 ట్రిప్పులు నడపాలని ఈ ప్రాంత భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement