
మాజీ ఎమ్మెల్యే రమేశ్బాబు ఓటు తొలగింపు
● కోర్టు తీర్పుతో రెవెన్యూ అధికారుల నిర్ణయం ● ఫలించిన ఆది శ్రీనివాస్ పోరాటం ● ప్రజాధనం రికవరీ చేయాలి : ప్రభుత్వ విప్
వేములవాడ: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బా బు భారత పౌరుడు కాదంటూ ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన న్యాయపోరాటం ఫలించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రెవెన్యూ అధికారులు రమేశ్బాబు ఓటుహక్కును తొలగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు ఇంటిగేట్కు నోటీస్లను అంటించారు.
పౌరసత్వ వివాదం ఇలా
చెన్నమనేని రమేశ్బాబు ఆయన తండ్రి చెన్నమనేని రాజేశ్వర్రావు వారసుడిగా రాజకీయాల్లోకి 2009లో ప్రవేశించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన రమేశ్బాబు సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్పై 1,821 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రమేశ్బాబు ఎన్నికల్లో పోటీ సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్లో ఏడాదిగా ఇండియాలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. దీన్ని సవాల్ చేస్తూ ఆది శ్రీనివాస్ హైకోర్టులో ఫిర్యాదు చేశారు. ఏడాదిగా స్వదేశంలో ఉన్నట్లు రుజువు చూపించాలని హైకోర్టు కోరింది. విచారణలో 96 రోజులు మాత్రమే ఇండియాలో ఉన్నారని తేలింది. దీంతో 2013లో రమేశ్బాబు పౌరసత్వం చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై రమేశ్బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించింది. 2017 ఆగస్ట్ 31న పౌరసత్వం చెల్లదని కేంద్రహోంశాఖ స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టు సైతం రమేశ్బాబు జర్మనీ పౌరుడని తేల్చి చెప్పింది. ఈమేరకు రమేశ్బాబు రూ.30లక్షలు జరిమానా చెల్లించాలని తీర్పులో స్పష్టం చేసింది. ఇందులో ప్రత్యర్థి ఆది శ్రీనివాస్కు రూ.25లక్షలు చెల్లించాలని తెలిపింది. ఆమేరకు రమేశ్బాబు తరఫున న్యాయవాది చెల్లింపులు పూర్తి చేశారు.
కేసు విచారణలోనే నాలుగు సార్లు ఎమ్మెల్యే
2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన రమేశ్బాబు 2010 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి మళ్లీ పోటీచేశారు. 2010లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఆది శ్రీనివాస్పై విజయం సాధించారు. పౌరసత్వం కేసు విచారణలో ఉండగానే 2014, 2018 సాధారణ ఎన్నికల్లోనూ పోటీచేసి గెలుపొందారు.
ఫలించిన న్యాయ పోరాటం
రెండు దశాబ్దాలుగా చేసిన న్యాయపోరాటం ఫలించింది. ఎన్నికల సమయంలో రమేశ్బాబు తప్పుడు సమాచారం ఇచ్చారని, విదేశీ పౌరుడిగా ఉండి భారత ఎన్నికల్లో పోటీ చేశారని వాదనలు వినిపించాం. చివరికి కోర్టు నా వాదనను సమర్థించి తీర్పు వెలువరించింది. న్యాయ వ్యవస్థలను సైతం తప్పుదోవ పట్టిస్తూ రమేశ్బాబు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయన ప్రజాధనం వృథా చేశారు. ఎమ్మెల్యేగా పదవీలో ఉన్నప్పుడు ఆయన పొందిన ప్రజాధనం ప్రజలకే చెందేలా పోరాటం చేస్తాను.
– ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్

మాజీ ఎమ్మెల్యే రమేశ్బాబు ఓటు తొలగింపు