సాయం మరచి.. అన్నదాతను ముంచి
రైతులకు దక్కని భరోసా సుఖీభవ అంటూనే నట్టేట ముంచుతున్న చంద్రబాబు సర్కారు తొలి ఏడాది అన్నదాత సుఖీభవకు మంగళం రెండో ఏడాది ఇచ్చింది కొంత మందికే రెండేళ్ల వ్యవధిలో రెండు తుపాన్లు, అకాల వర్షాలు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా పైసా పరిహారం విదల్చని ప్రభుత్వం ‘రైతన్నా మీ కోసం’ అంటూ మరో మోసానికి రెడీ
రైతులకు ఎంతో ఉపయోగకరమైన 616 రైతు భరోసా కేంద్రాలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులతో పాటు రైతులకు సాగులో సలహాలు సైతం అందించింది. కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఇటువంటి రైతుహిత వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
బేస్తవారిపేట:
అన్నదాతలను ప్రకృతి కరుణించడం లేదు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదు. మార్కెట్ మాయాజాలానికి పతనమైన ధరలతో అడుగడుగునా నష్టపోతున్నా ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. ఏమీ చేయకుండానే ప్రచార డబ్బా కొట్టుకునేందుకు చంద్రబాబు సర్కారు మళ్లీ ముందుకొచ్చింది. జనాన్ని నమ్మించి మోసం చేసేందుకు రైతన్నా–మీ కోసం అంటూ కొత్త ఎత్తుగడతో ప్రచారానికి తెరలేపింది. రైతులకు ఎంతో చేశామని కలరింగ్ ఇచ్చేందుకు నాంది పలికింది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది రైతుల ఇంటి వద్దకు వెళ్లి ‘రైతన్న మీ కోసం’ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. నీటిభద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతుపై అవగాహన కల్పిస్తారు. ఈనెల 3వ తేదీన రైతు సేవా కేంద్రాల్లో వర్క్షాపులు పెట్టి, రానున్న రబీ, వచ్చే ఏడాది ఖరీఫ్, రబీ పంటలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. చేసిందేమీ లేకున్నా..ఇప్పుడు మా ముందుకు ఎందుకొస్తున్నారంటూ రైతులు గుసగుసలాడుకుంటున్నారు.
సుఖీభవ అంటూ దుఃఖపెట్టారు..
అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రైతులకు ఏటా రూ.20 వేలు అందిస్తామని గత ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి కూటమి నేతలు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఈ పథకాన్ని ఎగ్గొట్టి రైతులకు పంగనామాలు పెట్టారు. రెండో ఏడాదిలోనూ జిల్లాలో 15,970 మంది రైతులకు మొండిచేయి చూపారు. వైఎస్సార్ రైతు భరోసా 2,84,113 మందికి వర్తిస్తే నేడు 2,68,163 మంది అర్హులుగా గుర్తించారు. మరోవైపు దాదాపు 45 వేల మంది కౌలు రైతులకు నయాపైసా కూడా ఇవ్వకుండా వారికి వేదననే మిగిల్చారు.
ఉచిత బీమాకు మంగళం...
ఉచిత బీమా పథకానికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. ప్రీమియం చెల్లింపు భారాన్ని రైతులపైనే మోపింది. బీమా ప్రీమియం భారం కావడంతో వందల మంది రైతులు బీమాకు దూరమయ్యారు. బీమా చెల్లించిన రైతులకు పంటలు నష్టపోయినా ఇన్సూరెన్స్ రాలేదు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రైతులకు గత ప్రభుత్వం అండగా నిలిచింది. నేడు చంద్రబాబు సర్కారు సున్నా వడ్డీ రాయితీని గాలిలో పెట్టింది.
మోంథా సాయం లేదు..
మోంథా తుపానుతో జిల్లాలో పత్తి 35,750 ఎకరాలు, సజ్జ 7,300, వరి 9,500, మొక్కజొన్న 7,100, ఇతర పంటలు 36 వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. తుపాను వచ్చి నెల రోజులవుతున్నా ప్రభుత్వం నేటికీ పరిహారం అందజేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి. 2024 డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన ఫెంగల్ తుపాను ధాటికి జిల్లాలోని పది మండలాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. శనగ పంట 5,506 హెక్టార్లు, మినుము 1,902 హెక్టార్లు, పొగాకు 1,333 హెక్టార్లు, మినుములు 1902 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. అప్పట్లో 7650 మంది రైతులు 25540 ఎకరాల్లో హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
2024 అక్టోబర్ కురిసిన అధిక వర్షాలకు జిల్లా వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. అక్టోబర్ 13 నుంచి 21వ తేదీ వరకు ముసురుపట్టి భారీ వర్షాలు పడటంతో దాదాపు 24,700 ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. నేటికీ రైతులకు ఒక్క రూపాయి ప్రభుత్వం విడుదల చేయలేదు.
మోంథా తుపానుతో తీవ్రంగా
నష్టపోయాను
కౌలుకు తీసుకుని మూడు ఎకరాల్లో అరటి, మూడు ఎకరాలు వరి, ఒక ఎకరా పసుపు పంట సాగు చేశాను. పది రోజులుగా వర్షం విడవకుండా పడింది. కతువ ఉప్పొంగి పొలాలను వరద నీరు ముంచెత్తింది. నిండు కాపుతో ఉన్న అరటి చెట్లు కిందపడిపోయాయి. పంట మొత్తం నాశనమైంది. ప్రభుత్వం నష్టపరిహారం విడుదల చేయాలి.
– చిట్టె మల్లిఖార్జున, సోమవారిపేట
కౌలు రైతులకూ అన్నదాత సుఖీభవ ఇవ్వాలి
అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు వర్తింపచేయాలి. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్కు అదనంగా రూ.20 వేలు ఇస్తామన్నారు. గతంలో అకాల వర్షాలు, తుపాను రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నేటికీ నష్ట పరిహారం విడుదల చేయలేదు. గత నెలలో మోంథా తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయారు. ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి. – ఢాకాల పుల్లయ్య,
రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి
సాయం మరచి.. అన్నదాతను ముంచి
సాయం మరచి.. అన్నదాతను ముంచి
సాయం మరచి.. అన్నదాతను ముంచి


