హోరా హోరీగా రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు
సింగరాయకొండ: మండల కేంద్రంలోని ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–19 బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. లీగ్ దశలో జరిగిన 30 మ్యాచ్ల్లో బాలబాలికలు పోటా పోటీగా పాల్గొన్నారు. లీగ్ మ్యాచ్లలో బాలుర విభాగంలో పూల్ సిలో విన్నర్స్గా విశాఖపట్నం, రన్నర్స్గా కర్నూలు, పూల్ డిలో విన్నర్గా కడప, రన్నర్గా చిత్తూరు, బాలికల విభాగంలో పూల్ బిలో విన్నర్ గా కడప, రన్నర్గా ప్రకాశం, పూల్ సిలో విన్నర్గా వెస్ట్ గోదావరి, రన్నర్గా విజయనగరం, పూల్ డిలో విన్నర్గా కృష్ణా, రన్నర్గా గుంటూరు జట్లు నిలిచాయి. మిగిలిన పూల్ విభాగాల్లో జరగాల్సిన పోటీలను మంగళవారం ఉదయం నిర్వహించి క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ను మధ్యాహ్నానికి పూర్తి చేసి సాయంత్రానికి ఫైనల్స్ నిర్వహించనున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కే శంకర్రావు, అండర్–19 కార్యదర్శి ఈ చింపారెడ్డి తెలిపారు. ఈ టోర్నమెంటులో ఎస్సై బీ మహేంద్ర, డీఐఈఓ కే ఆంజనేయులు, జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ పీ విజయ్కుమార్, పీఈటీలు ఎస్డీ జంషీర్, ఎన్టీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


