
డీజే దాబాపై విజిలెన్స్ దాడులు
డెంకాడ: మండలంలోని పెదతాడివాడ జంక్షన్ సమీపంలో ఉన్న డీజే దాబాపై మంగళవారం విజిలెన్స్ దాడులు జరిగాయి. ఇంటి అవసరాలకు వాడాల్సిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరమైన డీజే దాబాలో వినియోగించుతుండడంతో విజిలెన్స్ సీఐ బి.సింహాచలం, సిబ్బంది తనిఖీ చేసి పట్టుకున్నారు. దీంతో డీజే దాబాపై 6ఏ కేసు నమోదు చేశామని వివరించారు. పట్టుకున్న 5 గ్యాస్ సిలిండర్లను విజయనగరం ఆదిత్య గ్యాస్ ఏజెన్సీకి అప్పగించామన్నారు. విజిలెన్స్ దాడిలో సీఎస్డీటీ ఆర్.శంకరరావు, వీఆర్వోలు డి.కృష్ణబాబు, మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు.
త్వరితగతిన పనులు పూర్తి చేయాలి
● ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాస్తవ
పార్వతీపురం: జీడి ప్రాసెసింగ్ యూనిట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ సిబ్బందికి పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. పట్టణ పరిధిలోని మార్కెట్ యార్డ్లో నిర్మిస్తున్న జీడి ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన జరుగుతున్న పనులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీడి తోటలను సాగు చేసే రైతులకు జీడి పంటకు విలువ ఆధారితను కల్పించేందుకు జీడి ప్రాసెసింగ్ యూనిట్ ఎంతో దోహదం చేస్తుందన్నారు. జీడి రైతులకు, గిరిజనులకు ఈ యూనిట్ ఎంతో లాభదాయకంగా ఉంటుందన్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ పరిశీలనలో ఇంజినీరింగ్ అధికారి మణిరాజ్, ఏపీవో మురళీధర్ తదితరులున్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్ తీరుపై
ఎంపీడీవో విచారణ
పూసపాటిరేగ: మండలంలోని బత్తివలస గ్రామ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ తీరుపై ఎంపీడీవో ఎం.రాధిక మంగళవారం విచారణ చేపట్టారు.ఆయనపై బినామీ మస్తర్లు వేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయనను కార్యాలయానికి పిలిపించి మరీ విచారణ చేశారు. పలువురు వేతనదారులను కూడా కార్యాలయానికి రప్పించి ఫీల్డ్ అసిస్టెంట్ బినామీ మస్తర్లు వేయడంపై ఆరాతీశారు. గతంలో జరిగిన ఉపాధి పనుల సోషల్ ఆడిట్లోనూ అవకతవకలు జరిగినట్లు బయపడిందని గుర్తు చేశారు. తదుపరి చర్యలు ఏం తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది. ఆమె వెంట ఏపీవో తిరుపతిరావు తదితరులు ఉన్నారు.
అరటి పంటకు నష్టం
చీపురుపల్లి: మండలంలో సోమవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు అరటి పంటకు నష్టం వాటిల్లినట్టు ఉద్యానవన శాఖాధికారి సీహెచ్ చంద్రశేఖర్ తెలిపారు. మండలంలోని పీకే పాలవలస, పేరిపి, గొల్లలములగాం, గొల్లలపాలెం తదితర గ్రామాల్లో ఎనిమిది ఎకరాల్లో అరటి పంట, మూడు ఎకరాల్లో బొప్పాయి పంట నేలకొరిగినట్టు ఆయన తెలిపారు.
భూముల వివరాల పరిశీలన
లక్కవరపుకోట : అన్నధాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకాల వర్తింపుకై రైతులకు సంబంధించి భూముల వివరాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీ చేస్తున్నట్టు ఏవో స్వాతికుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ రైతు తన భూమికి సంబంధించిన 1 బీ, ఆధార్, రేషన్ కార్డు, ఫోన్ నంబరుతో సమీప రైతు సేవా కేంద్రాలకు వెళ్తే.. అక్కడ సిబ్బంది సంబంధిత పత్రాలను పరిశీలన చేసి నమోదు చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియ ఈ నెల 20వ తేదీ వరకు జరుగుతుందన్నారు. అలాగే పచ్చి రొట్ట విత్తనాలైన జీలుగా, కట్టి జనుము, పిల్లి పెసర విత్తనాలు 50 శాతం రాయితీపై రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. విత్తనాల కావల్సిన రైతులు 1బీ, ఆధార్ కార్డుతో సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు.

డీజే దాబాపై విజిలెన్స్ దాడులు

డీజే దాబాపై విజిలెన్స్ దాడులు