
పిడుగులు పడేటప్పుడు తస్మాత్..: కలెక్టర్
పార్వతీపురం టౌన్: పిడుగులు పడేటప్పుడు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ప్రజలకు సూచించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావరణంలో మార్పులపై రాష్ట్ర విపత్తుల సంస్థ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఫోన్ ద్వారా కూడా అందిస్తుందని, వాటి ఆధారంగా ప్రజలు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. వాతావరణ విపత్తులపై ఏపీ విపత్తుల సంస్థ ఫోన్లలో అప్రమత్తం చేస్తుందని వాటిని పాటించాలని కోరారు. వివిధ ప్రాంతాల్లో పిడుగు పాటుకు ఒకరిద్దరు మృతి చెందినట్టు సమాచారం అందుతుందని ప్రజలందరూ వీటి పట్ల జాగ్రత్త వహించాలన్నారు.
విద్యుదాఘాతంతో రెండు దున్నల మృతి
భామిని: మండలంలోని సొలికిరికి చెందిన బిల్లింగి కురువులకు చెందిన రెండు దున్నపోతులు విద్యుదాఘాతానికి గురై శనివారం మృతి చెందాయి. వీటి సుమారు రూ.లక్ష ఉంటుందని చెబుతున్నారు. సొలికిరి నుంచి ఇసుకగూడ వెళ్లే దారిలో విద్యుత్ స్తంభాలు ఒరిగి ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయం భామిని విద్యుత్ శాఖాధికారులకు తెలియడంతో ప్రమాదాన్ని వచ్చి చూశారు. అనంతరం పశు సంవర్ధక శాఖ అధికారులు వచ్చి దున్నపోతులకు పోస్టుమార్టం చేసి బాధిత రైతుకు అప్పగించారు.
బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
బొండపల్లి: మండల కేంద్రంలోని జాతీయ రహదారి 26పై నడిచి వెళ్తున్న కిలపర్తి సన్యాసప్పడును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గాయాల పాలయ్యాడు. సన్యాసప్పడు జాతీయ రహదారిని దాటే క్రమంలో విజయనగరం వైపు నుంచి గజపతినగరం వైపు వెళ్తున్న వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
పట్టుబడిన పీడీఎస్ బియ్యం
పార్వతీపురం రూరల్: మండలంలోని గోచెక్క గ్రామంలో ఆంధ్రా నుంచి ఒడిశాకు అక్రమంగా బొలెరో వాహనంలో పది క్వింటాళ్ల ప్రభుత్వ ఉచిత సరఫరా బియ్యాన్ని తరలించేందుకు సిద్ధం చేస్తుండగా ముందస్తు సమాచారంతో తరలించిన వారితో పాటు బొలెరో వాహనం పట్టుకున్నామని విజిలెన్స్ ఎస్ఐ బి.రామారావు తెలిపారు. బొలెరోలో ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. గోచెక్క గ్రామానికి చెందిన వ్యక్తులు ఈ బియ్యాన్ని తరలించేందుకు సిద్ధమవుతుండగా శనివారం పక్కా సమాచారంతో దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పట్టుబడిన బియ్యాన్ని ప్రభుత్వ గోదాంలకు తరలించినట్టు తెలిపారు. అలాగే వ్యక్తిపై కేసు నమోదు చేసి వాహనాన్ని పార్వతీపురం గ్రామీణ ప్రాంత పోలీసుస్టేషన్కు అప్పగించామన్నారు. దాడుల్లో సీఎస్డీటీ ఎం.రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.
పాడైన రైల్వేగేట్
● గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్
దత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురం రైల్వే గేట్ శనివారం రాత్రి పాడవ్వడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. రెండువైపులా సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అటు వైజాగ్, విజయనగరం, గజపతినగరం.. ఇటు ఒడిశా, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి తదితర దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సిబ్బంది వచ్చి సమస్య పరిష్కరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

పిడుగులు పడేటప్పుడు తస్మాత్..: కలెక్టర్

పిడుగులు పడేటప్పుడు తస్మాత్..: కలెక్టర్

పిడుగులు పడేటప్పుడు తస్మాత్..: కలెక్టర్