దుర్గమ్మకు ఆషాఢ సారె | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు ఆషాఢ సారె

Jun 27 2025 4:21 AM | Updated on Jun 27 2025 4:21 AM

దుర్గమ్మకు ఆషాఢ సారె

దుర్గమ్మకు ఆషాఢ సారె

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం తరఫున ఆలయ ఈఓ శీనానాయక్‌ దంపతులు దుర్గమ్మకు తొలి సారె సమర్పించారు. తొలుత ప్రధాన ఆలయంలోని మూల విరాట్‌కు, ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి ఉత్సవ మూర్తిని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆరో అంతస్తులో వేదికపై దుర్గమ్మ ఉత్సవ మూర్తిని ప్రతిష్టించిన ఆలయ అర్చకులు పూజలు జరిపించారు. అనంతరం దేవస్థానం తరఫున ఆలయ ఈఓ శీనానాయక్‌ దంపతులు అమ్మవారికి పట్టుచీర, పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, మిఠాయిలు సమర్పించారు. అమ్మ వారికి సారె సమర్పించేందుకు తరలివచ్చిన భక్త బృందాలు, భక్తుల కుటుంబ సభ్యులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకుంది. సారె సమర్పించిన అనంతరం భక్తులు తమ బంధువులు, స్నేహితులకు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్‌, వైదిక కమిటీ సభ్యుడు కోట ప్రసాద్‌ పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ ఏసీ సీహెచ్‌.రంగారావు, ఏఈఓలు ఎన్‌.రమేష్‌బాబు, వెంకటరెడ్డి, తిరుమలరావు, జంగం శ్రీనివాస్‌, కె.గంగాధర్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement