
దౌర్జన్యమే గెలిచింది
ప్రజాస్వామ్యానికి అధికార కూటమి నిలువునా పాతరేసింది.. బలం లేని చోట ఎలాగైనా గెలవాలనే కుతంత్రంతో బెదిరింపుల తంత్రం.. ప్రలోభాల మంత్రం ఎంచుకుని బరిలోకి దిగింది. ఇందుకు తనిఖీల పేరుతో అధికారులు.. కేసుల బెదిరింపులతో ఖాకీలు పూర్తిగా సహకరించగా.. ఇక మిగతా పని టీడీపీ గుండాలు చూసుకున్నారు. ఎన్నికై న సభ్యులను కేంద్రాల్లోకి రానీకుండా దాడులకు దిగి, దౌర్జన్యం చేస్తూ భయానక వాతావరణం సృష్టించగా.. కవరేజీకి వెళ్లిన పాత్రికేయులపై సైతం విచక్షణ మరిచి దాడులకు పాల్పడ్డారు.
● మండల పరిషత్ ఎన్నికల్లో నిబంధనలకు తూట్లు ● అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా పదవులు ● వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను బెదిరించి ఓటు వేయించుకున్న వైనం ● మాట వినని వారిని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకున్న టీడీపీ గుండాలు ● దౌర్జన్యాలకు సహకరించిన పోలీసులు
ప్రజాస్వామ్యానికి టీడీపీ పాతర బలం లేకున్నా నరసరావుపేట, కారంపూడి వైస్ ఎంపీపీ స్థానాల్లో పోటీ
నరసరావుపేట రూరల్: అధికార మదంతో కూటమి నేతలు ప్రజాస్వామ్యానికి పాతర వేశారు. మండల పరిషత్ ఎన్నికల్లో కనీసం నామినేషన్ వేయడానికి ఆ పార్టీ తరఫున ఒక్క ఎంపీటీసీ కూడా లేకపోయినా తెలుగుదేశం పార్టీ బరిలో నిలిచింది. అక్రమ కేసులు, దాడుల భయం చూపి లాక్కున ఒకరిద్దరు ఎంపీటీసీలను ముందు పెట్టి వైస్ ఎంపీపీ స్థానాలను టీడీపీ దక్కించుకుంది. అక్రమంగా పదవులను దక్కించుకొనే క్రమంలో కూటమి నేతలు నిబంధనలకు పాతర వేశారు. ఎంపీటీసీలను సైతం ఎన్నిక జరుగుతున్న ఎంపీడీఓ కార్యాలయాలకు రాకుండా గుండాలతో అడ్డుకున్నారు. మాట వినని ఎంపీటీసీలను కారంపూడి ఎంపీడీఓ కార్యాలయం గేటు బయటే కొట్టి మరీ తరిమేశారు. టీడీపీ దౌర్జన్యాలను అడ్డుకోవాల్సిన పోలీసులు వారికి సహకరించడం గమనార్హం. కారంపూడి ఎంపీడీఓ కార్యాలయం వద్ద టీడీపీ గుండాల దురాగతాలను కవర్ చేయడానికి అక్కడికి వెళ్లిన ‘సాక్షి’ టీవీ గుంటూరు జిల్లా ప్రతినిధి అశోక్ వర్ధన్పై పచ్చ గుండాలు దాడి చేశారు. అశోక్పై పిడుగుద్దులు గుద్దుతూ దాడి చేస్తుండగా పోలీసులు రక్షించారు. దీనిపై జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నరసరావుపేట వైస్ ఎంపీపీగా సువార్తమ్మ
నరసరావుపేట మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా కొత్తపాలెం ఎంపీటీసీ వంపుగుడి సువార్తమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం వైస్ ఎంపీపీ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. మండల పరిషత్లో మొత్తం 17 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ప్రత్యేక సమావేశాన్ని వైఎస్సార్ సీపీ బహిష్కరించింది. వైస్ ఎంపీపీ ఎన్నిక గతంలో రెండు సార్లు కోరం లేక వాయిదా పడిన విషయం తెలిసిందే. మూడవ సారి నిర్వహిస్తున్న ఎన్నిక కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి ప్రత్యేక అధికారాన్ని వినియోగించారు. కోరం లేక రెండు సమావేశాలు వాయిదా పడితే మూడవ సమావేశంలో హజరైన వారిలో ఒకరిని వైస్ ఎంపీపీగా ఎన్నుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. కొత్తపాలెం ఎంపీటీసీ వంపుగుడి సువార్తమ్మ వైస్ ఎంపీపీగా నామినేషన్ దాఖలు చేశారు. పమిడిపాడు–1 ఎంపీటీసీ కంచేటి భార్గవి ప్రతిపాదించగా, ఉప్పలపాడు ఎంపీటీసీ కందుల దుర్గమ్మ బలపరిచారు. సువార్తమ్మ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.
కారంపూడిలో దౌర్జన్యకాండ...
కారంపూడి మండలం వైస్ ఎంపీపీగా టీడీపీ బలపరిచిన గాడిపర్తి రమాదేవి సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో 14 ఎంపీటీసీ స్థానా లకు 14 వైఎస్సార్ సీపీ అభ్యర్థులే గెలుపొందారు. కారంపూడి మండలం వేపకంపల్లి ఎంపీటీసీ వైస్ ఎంపీపీ–2గా కొనసాగుతూ మరణించడంతో వైస్ ఎంపీపీ ఎన్నిక అనివార్యం అయింది. గత రెండు పర్యాయాలు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు గైర్హాజరవడంతో ఎన్నిక వాయిదా పడింది. తిరిగి మరొకసారి ఎన్నిక కమిషన్ సోమవారం నోటిఫికేషన్ ఇవ్వడంతో 14 మంది ఎంపీటీసీలకు గాను ఆరుగురు హాజరు కాగా గాదెవారిపల్లి ఎంపీటీసీ కూనిరెడ్డి సైదారెడ్డి బలపరచగా ఒప్పిచర్ల చెందిన ఇద్దరు ఎంపీటీసీలు ఆమోదించగా మిగతా ఎంపీటీసీలు మద్దతుతో వైస్ ఎంపీపీగా రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ఎస్.లింగమూర్తి అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను ఎన్నికలు జరుగుతున్న కారంపూడి ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకొని దాడులు చేశారు. కారంపూడిలో భయానకవాతావరణం సృష్టించి టీడీపీ ఎన్నికల్లో గెలుపొందింది.
ఉప సర్పంచ్గా ఏఎస్కేవీ రంగారెడ్డి ఏకగ్రీవం
మండ్రువారిపాలెం ఉప సర్పంచ్గా ‘పాపసాని’
శావల్యాపురం: మండలంలోని ముండ్రువారిపాలెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక సోమవారం జరిగినట్లు ఎన్నికల అధికారి ఎంఈఓ మద్దికుంట సాంబశివరావు తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో 10 మంది వార్డు సభ్యులకుగానూ 9 మంది ఎన్నికల్లో పాల్గొన్నారు. 4వ వార్డు సభ్యుడు పాపసాని వెంకటేశ్వర్లును ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా సభ్యులు చేతులెత్తే విధానంలో ఎన్నుకున్నట్లు తెలిపారు. ఏఆర్ డీఎస్పీ గాంధీ, ఎస్ఐ లేళ్ల లోకేశ్వరరావు తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ పేరుమీనా సీతారామయ్య, పంచాయతీ కార్యదర్శి వాసు తదితరులు పాల్గొన్నారు.
చాగంటివారిపాలెం(ముప్పాళ్ళ): చాగంటివారిపాలెం గ్రామ ఉపసర్పంచ్గా వైఎస్సార్ సీపీకి చెందిన అన్నపురెడ్డి శివకోటి వెంకటరంగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం గ్రామ సచివాలయంలో జరిగిన ఉప ఎన్నికల్లో 3వ వార్డు సభ్యుడైన రంగారెడ్డిని 11వ వార్డు సభ్యురాలు నీలం కోటేశ్వరమ్మ ప్రతిపాదించగా, 1వ వార్డు సభ్యురాలు పుష్పలత బలపరిచారు. ఆ మేర ఉపసర్పంచ్గా రంగారెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి, ఈఓపీఆర్డీ ఎస్.రూపవతి ప్రకటించారు. ధ్రువీకరణ పత్రాన్ని అందించి ప్రమాణస్వీకారం చేయించారు.
బొప్పూడి ఉపసర్పంచ్గా అమీర్జాని
చిలకలూరిపేట: మండలంలోని బొప్పూడి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా వైఎస్సార్ సీపీకి చెందిన అప్పాపురం షేక్ అమీర్జాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుమారు ఆరునెలల కిందట ఉప సర్పంచ్గా ఉన్న నందిగం మేరి తన పదవికి రాజీనామా చేయడంతో ఉపసర్పంచ్ పదవికి ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్ సీపీకి సర్పంచ్తో పాటు 12 మంది వార్డు మెంబర్లలో 9 మంది బలముంది. టీడీపీకి కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో అమీర్ జాని ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయనను ఎన్నిక చేసినట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఎం.సూర్యతేజ ప్రకటించారు. అమీర్జానిని సర్పంచ్, వార్డు సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు అభినందించారు.

దౌర్జన్యమే గెలిచింది