
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు
నరసరావుపేట: మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు కోరారు. సోమవారం కార్యాలయంలో నష ముక్త్ భారత్ అభియాన్ 2.0లో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలియచేసే పోస్టర్లను ఆవిష్కరించారు. డీఆర్ఓ ఏకా మురళి, డీఈఓ చంద్రకళ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సీఎస్ వీడియో కాన్ఫరెన్స్..
అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లు, స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై సోమవారం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పి.అరుణ్బాబు, జేసీ సూరజ్ గనోరే హాజరయ్యారు.
దుగ్గిరాల మండల ఉపాధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం
దుగ్గిరాల: స్థానిక మండల పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నిక సోమవారం నిర్వహించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి డ్వామా పీడీ శంకర్ ప్రిసైండింగ్ అధికారిగా వ్యవహరించారు. టీడీపీ నుంచి ఎనిమిది మంది, జనసేన నుంచి ఒకరు హాజరయ్యారు. కోరం సరిపోవడంతో ప్రిసైండింగ్ అధికారి ఎన్నిక ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ సభ్యులంతా గైర్హాజర్ అయ్యారు. తుమ్మపూడి గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు వాసిరెడ్డి లక్ష్మీదేవి మంచికలపూడి ఎంపీటీసీ సభ్యుడు మరీదు రాము పేరును ప్రతిపాదించారు. ఈమని–1 ఎంపీటీసీ సభ్యురాలు పసుపులేటి సాయి చైతన్య బలపరిచారు. దీంతో మరీదు రాము ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రిసైండింగ్ అధికారి ఆయనకు ధ్రువీకరణ పత్రం అందించి ప్రమాణం చేయించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించారు.
ఆర్టీసీ స్థలాల లీజుపై 22న సమావేశం
పట్నంబజారు: గుంటూరు జిల్లా పరిధిలోని పెదకాకాని, తెనాలి, పెదనందిపాడు బస్సు స్టేషన్ల పరిధిలో ఖాళీగా ఉన్న ఆర్టీసీ స్థలాలను లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు ఈనెల 22న గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు రీజియన్ మేనేజర్ ఎం.రవికాంత్ తెలిపారు. ఆసక్తి గల వారు ఆ రోజు సమావేశానికి హాజరుకావాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాల కోసం ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్ఆర్టీసీ.ఏపీ.జీవోవి.ఇన్లో లేదా 9959225412 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
గరుడ వాహనంపై గ్రామోత్సవం
తెనాలి టౌన్: వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం 7.30 గంటలకు నిత్య హోమం, బలిహరణ, ఉదయం 8గంటలకు గరుడ వాహనంపై పురవీధుల్లో స్వామి గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు దివ్య రథోత్సవం, ప్రత్యేక పుష్పాలంకరణ, మేళతాళాలు, విద్యుత్ దీప కాంతుల నడుమ స్వామి గ్రామోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. పట్టణ ప్రజలంతా తిలకించి తరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ పర్యవేక్షించారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 512.70 అడుగుల వద్ద ఉంది. ఇది 136.3003 టీఎంసీలకు సమానం.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి