నరసరావుపేట ఈస్ట్: ఐదేళ్ల కిందట వరకు ప్రభుత్వ పాఠశాలలు కనీస వసతులు లేక కూనారిల్లుతుండేవి. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కన్పించేవి కావు. విద్యార్థులు కూర్చునేందుకు బల్లలు, పాఠం రాసేందుకు బ్లాక్ బోర్డులు సరేసరి. అటువంటి ప్రభుత్వ పాఠశాలలు జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటి రూపురేఖలు మారిపోయాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించారు. అధునాతన ఫర్నిచర్తో పాఠశాలలు నూతన శోభను సంతరించుకున్నాయి. ఇంగ్లిష్ మీడియంను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు.
పేదలకు ఎంతో అవసరమైన విద్య, వైద్యం రెండు కన్నులుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి కొనసాగుతున్నది. గతంలో ఏ ప్రభుత్వం కేటాయించని స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించారు. జగనన్న ప్రభుత్వం చేపట్టిన మనబడి నాడు–నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి నూతన పంథాలో కొనసాగింది. గత పాలకులు ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ బడులకు పంపాలంటే సంశయించేవారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. అటువంటి సర్కార్ బడులకు జగనన్న పాలనలో మహర్దశ పట్టింది. అధ్యానంగా ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలను అందంగా తీర్చిదిద్దటంతోపాటు అన్ని రకాల వసతులు కల్పించారు. ప్రతి తరగతి గదిలో కార్పొరేట్ స్థాయి బల్లలు, బ్లాక్ బోర్డు, లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. డిజిటల్ క్లాస్రూమ్లను నూతనంగా నిర్మించి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. పరిశుభ్రంగా మరుగుదొడ్లు, శుద్ధి చేసిన తాగునీటి వసతి కల్పించారు. వెలిసిపోయి బీటలు వారిన పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విజ్ఞానం, వినోదం కలసి వచ్చేలా రంగురంగులతో బొమ్మలు వేయించారు. విశాలమైన అదనపు గదులు నిర్మించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.472.6 కోట్లతో మనబడి నాడు–నేడు పనులు జరిగాయి. 1,420 తరగతి గదులకు ఇంటరాక్ట్ల్ ప్లాట్ ప్యానల్స్, మరో 474 తరగతి గదులలో స్మార్ట్ టి.వీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ బోధన అందిస్తున్నారు.
బడి తెరిచిన రోజే విద్యాకానుక...
ప్రతి ఏడాది పాఠశాలలు తెరిచే రోజునే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పేరుతో ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం, షూస్, బ్యాగ్ వంటి 10 రకాల విద్యా సంబంధ వస్తువులు అందిస్తున్నారు. జిల్లాలో ఈఏడాది 1,80,089 మంది విద్యార్థులు విద్యాకానుక అందుకున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడంతో సరిపెట్టకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నారు. ప్రాథమిక విద్య 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, 6వ తరగతి నుంచి డిజిటల్ క్లాస్రూమ్, 8వ తరగతి నుంచి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు అందిస్తున్నారు. జిల్లాలో దాదాపు 40 వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.120 కోట్లతో ట్యాబ్లు అందజేశారు. సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు పాఠ్య ప్రణాళికలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు.
జగనన్న అమ్మఒడి
జగనన్న అమ్మఒడి పథకం ద్వారా తమ పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంక్ ఖాతాలో ప్రతి ఏడాది రూ.15వేలు జమ చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో నాలుగేళ్లలో ఇప్పటి వరకు రూ.977.45 కోట్లు తల్లుల ఖాతాలోకి నేరుగా జమ చేశారు. విద్యార్థులకు మధ్యాహ్నం జగనన్న గోరుముద్ద పథకం కింద నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. వారంలో ఐదు రోజులపాటు భోజనంతోపాటు కోడిగుడ్డు, మూడురోజులు చిక్కీలు, మూడు రోజులు రాగిజావ అందిస్తున్నారు.
విద్యతోనే పేదరిక నిర్మూలన ఆలోచనలో వైఎస్ జగన్ విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం నాడు–నేడుతో దశ తిరిగిన ప్రభుత్వ పాఠశాలలు నాడు–నేడు నిధులు రూ.472.6 కోట్లతో జిల్లాలో పాఠశాలల అభివృద్ధి అమ్మ ఒడి పథకం ద్వారా తల్లులకు రూ.977.45 కోట్లు పంపిణీ 1,80,089 మంది విద్యార్థులకు ఏటా విద్యాకానుక రూ.120 కోట్లతో 40,134 బైజూస్ కంటెంట్ ట్యాబ్ల పంపిణీ