
బాల్కొండ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో..
బాల్కొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుటకు విద్యార్థులు కావలెను అంటూ అధ్యాపకులు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. 2023–24 విద్యాసంవత్సరం మధ్యలోనే డిగ్రీ కళాశాలను ప్రారంభించగా, 2024–25 విద్యా సంవత్సరంలో 30 మంది విద్యార్థులతో కళాశాలను కొనసాగించారు.కళాశాలలో బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సులుండగా, ప్రస్తుత విద్యా సంవత్సరమైన విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అధ్యాపకులు ఆశిస్తున్నారు. విద్యార్థులు తక్కువగా ఉండటంతో డిగ్రీ పరీక్ష కేంద్రం ఆర్మూర్లోనే కేటాయించారు.
వసతులు లేకపోవడంతోనే..
బాల్కొండ మండల ప్రజలు డిగ్రీ కళాశాల కోసం కొన్నేళ్ల నుంచి ఎదురు చూడగా 2023లో అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ సొంత భవనం లేకపోవడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని ఓ భవనంలో డిగ్రీ కళాశాలను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో రెగ్యులర్ ప్రిన్సిపాల్ కూడ లేడు. ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఇక్కడ ఇన్చార్జి ప్రిన్సిపాల్గా కొనసాగుతున్నారు. కళా శాలలో కనీస వసతులు కూడ లేకపోవడంతో విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి జంకుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించి, సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం
ప్రవేశాల కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రస్తుత విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సొంత భవనం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. విద్యార్థుల సంఖ్య పెరిగితే పరీక్ష కేంద్రం కూడ ఇక్కడే అనుమతి లభిస్తుంది.
– వేణు ప్రసాద్, ఇన్చార్జి ప్రిన్సిపాల్, బాల్కొండ