
దళిత రత్న అవార్డుల ప్రదానం
నిజామాబాద్ అర్బన్ : నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో దళిత రత్న అవార్డుల కమిటీ చైర్మన్ ఇటుక రాజు జిల్లాకు చెందిన దళిత నాయకులకు శుక్రవారం అవార్డులను అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో పులి జైపాల్, డాక్టర్ బుర్ర లక్ష్మణ్, కోటేశ్వరరావు, సదాశివరావు, విజయ కాంతారావు, అబ్బులు, సాయిలు, లత, జ్యోతి, కొత్తపల్లి దుర్గయ్య ఉన్నారు.
అనుమతి లేని పాఠశాలపై
చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్ అర్బన్: నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ సమీపంలో అనుమతి లేకుండా సీబీఎస్ పాఠశాల అంటూ అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్న ఓ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాలా శుక్రవారం డిమాండ్ చేశారు. రూరల్ మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. పాఠశాల భవనం నిర్మాణ దశలో ఉండగానే అడ్మిషన్లు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
బీజేపీ మండల కార్యవర్గ నియామకం
జక్రాన్పల్లి: మండల కేంద్రంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గాన్ని నియమించినట్లు పార్టీ మండల అధ్యక్షుడు కన్నెపల్లి ప్రసాద్ తెలిపారు. పార్టీ మండల ఉపాధ్యక్షులుగా నవీన్, చిరంజీవి, బాల్రెడ్డి, రాజకళా, ప్రధాన కార్యదర్శులుగా ఆకుల లత మహేందర్, కుంట శ్రీనివాస్, కార్యదర్శులుగా తిరుపతిరెడ్డి, లక్ష్మణ్, సాయిలు, మమత, కోశాధికారిగా కుంట భూషణ్తో పాటు మరో ఇరవై మంది కార్యవర్గ సభ్యులను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.
నేడు అహల్యాబాయి జయంతి
సుభాష్నగర్: మహారాణి అహల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా శనివారం సాయంత్రం జి ల్లా కేంద్రంలో శోభాయాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి శుక్రవారం తెలిపారు. నగరంలోని గోల్ హనుమాన్ మందిరం నుంచి కోటగల్లి మార్కండేయ మందిరం వరకు ఈ శోభాయాత్ర ఉంటుందని, యాత్రకు ముఖ్యఅతిథులుగా అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. శోభాయాత్రలో పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.