డొంకేశ్వర్/బాల్కొండ: జిల్లాలోని డొంకేశ్వర్, నందిపేట్, బాల్కొండ మండలాలను కలుపుతూ ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో త్వరలోనే ఎకో టూరిజం పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అటవీ అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫీసర్ (ఐఎఫ్ఎస్) సునీతాభగవత్ అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం కొంత నిధులను కూడా మంజూరు చేసిందని తెలిపారు. గురువారం ఆమె డొంకేశ్వర్ మండలం చిన్నయానం, బాల్కొండ మండలం జలాల్పూర్ వద్ద ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని సందర్శించారు.
చిన్నయానం ప్రాంతానికి విదేశాల నుంచి వచ్చిన ఫ్లెమింగో పక్షులను అలాగే అక్కడ సంచరిస్తున్న జింకలను బైనాక్యులర్స్ ద్వారా వీక్షించారు. వాచ్ టవర్లు, రిసార్టులు ఏర్పాటు చేసే స్థలాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జలాల్పూర్ శివారులో రైతులతో మాట్లాడారు. మాక్లూర్ మండలం చిన్నాపూర్ పార్క్ను సందర్శించి అక్కడే భోజనం చేశారు. ఆమె వెంట ఫారెస్ట్ డెవలప్మెంట్ రాష్ట్ర ఉన్నతాధికారి రంజిత్ నాయక్, డీఎఫ్వో వికాస్ మీనా, ఆర్మూర్ ఎఫ్డీవో భవానీ శంకర్, ఎఫ్ఆర్వో శ్రీనివాస్, డిప్యూటీ ఎఫ్ఆర్వోలు సుధాకర్, శ్రీదేవి ఉన్నారు.
డీజీపీని కలిసిన సీపీ
ఖలీల్వాడి: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) డాక్టర్ జితేందర్ను సీపీ సాయిచైతన్య కామారెడ్డిలో మర్యాదపూర్వకంగా కలిశారు. కామారెడ్డి పోలీస్ కార్యాలయానికి వచ్చిన డీజీపీని సీపీ కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
అందుబాటులో ఫౌండేషన్ విత్తనం
రుద్రూర్: రుద్రూర్ ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన కేంద్రంలో సోయా చిక్కుడు బాసర రకం ఫౌండేషన్ విత్తనం అందుబాటులో ఉందని పరిశోధనా స్థానం అధిపతి టి అంజయ్య తెలిపారు. ఈ రకం తెలుపు రంగు పుష్పాలు కలిగి, అధిక సంఖ్యలో కాయలను కలిగి ఉంటుందని, ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి సామర్ధ్యం కలిగి ఉందన్నారు. కోత ఆలస్యమైనా కాయ చిట్లిపోవడం తక్కువగా ఉంటుందని, ఆసక్తి గల రైతులు 99896 25218, 99853 31641 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

త్వరలో ఎకో టూరిజం పనులు