
క్షయ రోగులకు మెరుగైన చికిత్స అందించాలి
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో అనుమానిత క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పీహెచ్సీల పర్యవేక్షణ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షయ వ్యాధి అనుమానితులు, పొగ, మద్యపానం చేసేవారు, తక్కువ బరువు ఉన్నవారు, ఇంతకు ముందు క్షయ వ్యాధి చికిత్స తీసుకున్న కుటుంబ సభ్యులను గ్రామాల్లో నిర్వహించే ఆరోగ్య శిబిరాలకు తరలించి కళ్లె, ఎక్స్ రే పరీక్షలు నిర్వహించి వెంటనే క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స ప్రారంభించాలని సూచించారు. గుర్తించిన క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా పోషకాహార కిట్ అందజేయాలని, సంపూర్ణ చికిత్స తీసుకునేలా క్షేత్రసాయి సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి అబాకార్డ్ (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్)లను జనరేట్ చేయాలని, అబాకార్డు ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ, చికన్ గున్యా, మలేరియా వ్యాధుల నివారణ చర్యల గురించి ప్రతి శుక్రవారం ప్రజలందరూ వారి ఇంట్లో డ్రై డే పాటించేలా చూడాలన్నారు. గర్భం దాల్చిన వారందరినీ 12 వారాల్లోపు నమోదు చేసుకోవాలని, గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి రవికుమార్, వైద్యులు లక్ష్మణ్, కృష్ణమోహన్, డీపీఓ రేనయ్య, ఏపీఓలు శ్రీను, విజయ్కుమార్, నిరంజన్, మినహాజ్, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.