
లింగోటంలో ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం వివరాలు నమోదు చేస్తున్న సిబ్బంది
●
పథకంపై అవగాహన
కల్పించాలి
కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. కానీ ప్రచార లోపంతో క్షేత్రస్థాయిలో వాటి ఫలాలు వారికి అందడం లేదు. అధికారులు గ్రామాల్లో ఆయుష్మాన్ భారత్ నమోదుకు శిబిరాలు ఏర్పాటు చేసి తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి. ఆయుష్మాన్తో రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది.
– మండికారి బాలాజీ,
బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి
ఈ–కేవైసీ చేసుకోవాలి..
రేషన్కార్డు ఉన్న ప్రతీ ఒక్కరు ఈ పథకానికి అర్హులు. ఆరోగ్యమిత్ర, ఆరోగ్యశ్రీ ఎంప్మానెల్ ఉన్న ఆస్పత్రుల్లో లేదా సీఎస్సీ కేంద్రాల్లో ఉచితంగా నమోదు చేస్తారు. ఈ నెల31 వరకు తప్పని సరిగా ఈకేవైసీ చేయించుకుని ఆయుష్మాన్ భారత్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ప్రత్యేక కార్డులు అందజేస్తారు. ఈ కార్డుతో దేశంలో ఎక్కడైన వైద్య సేవలు పొందవచ్చు.
– ఎస్.శివ సీఎస్సీ జిల్లా మేనేజర్,
నాగర్కర్నూల్
అచ్చంపేట: ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ పథకాల కింద తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి రూ.5లక్షల వరకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద రూ.2లక్షల వరకు వైద్య ఖర్చులు చెల్లించేవారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ విలీనంతో ఆదనంగా రూ.3లక్షల వరకు లాభం చేకూరనుంది. ఈమేరకు జిల్లాలోని ఆయా మండలాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తూ కార్డులు నమోదు చేస్తున్నారు.
1,886 రకాల వ్యాధులకు చికిత్స
ఆయుష్మాన్ భారత్ కార్డుతో 1,886 రకాల వ్యాధులకు చికిత్స చేస్తారు. ప్రధానంగా మోకాలి చిప్ప మార్పిడి, కిడ్నీ, గుండె మార్పిడి వంటి అనేక రకాల వ్యాధులకు శస్త్ర చికిత్సలు చేయించుకునే వీలుంది. దీంతోపాటు ఆరోగ్యశ్రీకార్డు కలిగి ఉంటే దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఉచిత వైద్య సేవలు పొందేలా రూపొందించారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికి వేర్వేరుగా ప్రత్యేక కార్డులు అందజేస్తారు. ప్రతి ఒక్కరు ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ కార్డు పొందేందుకు అర్హులు. ఈనెల31 వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రత్యేక కేంద్రం వద్ద ఆరోగ్యమిత్ర, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటూ నమోదు చేస్తున్నారు. లబ్ధిదారు తప్పనిసరిగా శిబిరానికి వెళ్తే ఫొటో తీసుకుని వివరాలు నమోదు చేసుకుంటున్నారు.
లక్ష్యం 1.30లక్షలు
కొత్త రేషన్ కార్డు నంబర్తో ఆయుష్మాన్ భారత్కు అనుసంధానం చేస్తారు. ఆధార్కార్డు, గతంలో రేషన్కార్డుకు అనుసంధానం చేసిన సెల్ఫోన్ నంబరు చెబితే ఓటీపీ ద్వారా పొందుపరుస్తారు. అదేవిధంగా ఆయుష్మాన్ కార్డులు ఏప్రిల్లో అందించనున్నారు. ఈ కార్డుతో దేశంలో ఎక్కడైనా ఆయుష్మాన్ భారత్ సేవలు పొందవచ్చు. ఇదిలాఉండగా, జిల్లాలో 1,30,000 లబ్ధిదారుల వివరాలు సేకరించి కార్డులు అందజేయాలన్నది లక్ష్యంగా నిర్ధేశించారు. ఇప్పటి వరకు 1.02లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఇంకా 28,000 మంది నమోదు చేసుకోవాల్సి ఉంది.
31న ముగియనున్న ‘ఆయుష్మాన్ భారత్’ ఈ–కేవైసీ గడువు
పథకం కింద రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం
జిల్లాలో 1.30లక్షల మంది
నమోదే లక్ష్యం..
పెండింగ్లో 28,000 మంది

ఆయుష్మాన్ భారత్ కార్డులు
