
అభిమన్యు గ్రూప్కు అరుదైన గౌరవం
నార్నూర్: బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ‘నేనున్నాను’ అని భరోసా కల్పిస్తూ మానవతా దృక్పధంతో వాట్సప్ గ్రూప్ ద్వారా సేవలందిస్తున్న మేస్రం శేఖర్ గురువారం కలెక్టర్ రాజర్షి షా, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ చేతుల మీదుగా ప్రశంసపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారికి ఆర్థికసాయం అందించడంతో పాటు 20 సార్లు రక్తదానం చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులు ఆస్పత్రికి వచ్చి వైద్యం చేయించుకునేలా ప్రభుత్వ ఆస్పత్రులపై వారికి నమ్మకం కలిగేలా అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
బొలెరో ఢీకొని ఒకరు దుర్మరణం
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లి సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపిన వివరాల మేరకు బోథ్ మండలంలోని సాకెరకు చెందిన కుందూరు రాజు (23), ఖుర్షీద్నగర్కు చెందిన దర్శనాల సునీల్ ద్విచక్ర వాహనంపై తిర్పెల్లి వైపు వెళ్తుండగా బొలెరో అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో రాజు సంఘటన స్థలంలోనే మృతి చెందగా సునీల్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
కుంటాల: బైక్ అదుపుతప్పి యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఆయిటి రాజు (26)గురువారం రాత్రి పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై ఓలా గ్రామానికి వెళ్లి వస్తుండగా కుంటాలకు సమీపంలో సమీపాన బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు.
సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
మంచిర్యాలఅగ్రికల్చర్: సెటిల్మెంట్, భూరికార్డుల కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ సర్వే ఆదేశాల ప్రకారం లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు మీ సేవ కేంద్రాలలో ఈ నెల 17 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికై న వారికి జిల్లా ప్రధాన కేంద్రంలో 50 రోజులపాటు శిక్షన ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ గణితంలో 60 శాతం మార్కులు, ఐటీఐ, డ్రాఫ్ట్మెన్ (సివిల్) / డిప్లొమా సివిల్) / బీటెక్ సివిల్) సమాన అర్హత గల అభ్యర్థులు అర్హులన్నారు. ఓసీ అభ్యర్థులు రూ.10 వేలు, బీసీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

అభిమన్యు గ్రూప్కు అరుదైన గౌరవం