
చెరువు మరమ్మతు పనులు ప్రారంభం
కురవి: మండలంలోని నేరడ పెద్ద చెరువు కట్ట కు బుంగ పడగా.. మరమ్మతు పనులను ప్రా రంభించారు. బుధవారం సాక్షి దినపత్రికలో ‘చెరువు కట్టకు బుంగ’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించిన కురవి ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్రెడ్డి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ ఆదేశానుసారం చెరువు కట్టకు పడిన బుంగను పూడ్చేందుకు సిమెంట్, ఇసుక, కంకర తెప్పించి పనులు చేయడం జరిగిందన్నారు. అలాగే అలుగు కాల్వ దెబ్బతినడంతో మరమ్మతులు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్కే.నజీర్, కొలిపాక రాములు, నీరుడు ధనరాజ్, నరెడ్ల వెంకటరెడ్డి, కిషన్ నాయక్, సోమ్లానాయక్, ఇరుగు వెంకన్న,పరమేశ్వర్,సక్రాం, నరేష్, ఐనాల విక్రమ్, రంగన్న, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
ఈపాస్ మిషన్లతో
ఎరువులు విక్రయించాలి
మహబూబాబాద్ రూరల్: డీలర్లు ఈపాస్ మిషన్లలో వివరాలు నమోదు చేసుకొని రైతులకు ఎరువులు విక్రయించాలని డీఏఓ ఎం.విజయనిర్మల అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని రైతు వేదికలో నేషనల్ ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఎరువుల అమ్మకానికి ఉపయోగించే ఈపాస్ యంత్రాలను జిల్లాలోని ఎరువుల డీలర్లకు డీఏఓ బుధవారం ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఏడీఏ శ్రీనివాసరావు, నేషనల్ ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీ రీజినల్ మేనేజర్ వంశీకృష్ణ, కంపెనీ స్థానిక సిబ్బంది సందీప్, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి
తొర్రూరు: రాజీ మార్గంలో పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు చొరవ చూపాలని తొర్రూరు సివిల్ కోర్టు జడ్జి ధీరజ్కుమార్ పోలీస్ అధికారులు, న్యాయవాదులు, కోర్టు పోలీస్ కానిస్టేబుళ్లకు సూచించారు. బుధవారం డివిజన్ కేంద్రంలోని కోర్టు హాల్లో జరిగిన అవగాహన సదస్సులో జడ్జి ధీరజ్కుమార్ మాట్లాడుతూ.. జూన్ 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో కక్షిదారులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏపీపీ రేవతిదేవి, డీఎస్పీ కృష్ణ కిశోర్, సీఐలు గణేష్, రాజ్కుమార్, ఎస్సైలు, కోర్టు పోలీస్ కానిస్టేబుళ్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై
అప్రమత్తంగా ఉండాలి
● డీఎంహెచ్ఓ రవి రాథోడ్
పెద్దవంగర: వానాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ సూచించారు. బుధవారం మండలంలోని అవుతాపురం పల్లె దవాఖానను ఆయన తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి, మౌలిక వసతులపై ఆరా తీశారు. పల్లెదవాఖాన వైద్యురాలు పలు సమస్యలను డీఎంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రవి రాథోడ్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు. ఫ్రైడే డ్రైడే వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు శుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో పల్లె దవాఖాన వైద్యురాలు సబితరాణి, ఏఎన్ఎం జ్యోత్స్న, ఆశకార్యకర్తలు సరిత, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.

చెరువు మరమ్మతు పనులు ప్రారంభం

చెరువు మరమ్మతు పనులు ప్రారంభం