
ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు
మహబూబాబాద్ రూరల్ : దేశ వ్యాప్తంగా నెలకొ న్న యుద్ధ వాతావరణ పరిస్థితులు, సరిహద్దు జిల్లాలో మావోయిస్టుల అలజడుల నేపథ్యంలో నిఘాను మరింత పటిష్టపరిచేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం భద్రతా చర్యలు చేపట్టారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రధాన రహదారులు, గ్రామీణ మార్గాల్లో వాహన తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను గుర్తించి విచారణ చేస్తున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ప్రత్యేక బలగాలతో నిఘా చర్యలను ముమ్మరం చేసి, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, వసతి గృహాలు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. గ్రామస్థాయిలో పోలీస్ కమ్యూనిటీ ఇంటరాక్షన్ కార్యక్రమాలను నిర్వహించి అవగాహన చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ శాఖ పక్షాన ప్రజలకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100 నంబరుకి లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్