
రైల్వేస్టేషన్లో తనిఖీలు
కర్నూలు: రైల్వే డీఐజీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు కర్నూలు రైల్వేస్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫామ్తో పాటు వెయిటింగ్ హాల్, పార్సిల్ బుకింగ్ ఆఫీస్, టిక్కెట్ కౌంటర్లతో పాటు వచ్చిపోయే రైళ్లలో కూడా తనిఖీలు చేశారు. కర్నూలు డాగ్ స్క్వాడ్ బృందంతో పాటు పోలీసు బృందాలు ఆయా కార్యాలయాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మాదక ద్రవ్యాలు గంజాయి, కొకెయిన్, హెరాయిన్తో పాటు నిషేధిత పదార్థాలు, పేలుడు పదార్థాలు, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేశారు. అనుమానితులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి వ్యక్తిగతంగా అడ్రస్సులు సేకరించి ఆరా తీశారు.
యూరియా వినియోగంపై పరిశ్రమల్లో పరిశీలన
కర్నూలు(అగ్రికల్చర్): పారిశ్రామిక అవసరాలకు యూరియా వినియోగిస్తున్నారా అనే దానిపై వ్యవసాయ శాఖ తనిఖీలు చేపట్టింది. యూరియాను వ్యవసాయానికే కాకుండా వివిధ పారిశ్రామిక అవసరాలకు సైతం వినియోగిస్తుట్లుగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, సి.బెళగల్ ఏఓ మల్లేష్ యాదవ్ ఒక బృందంగా ఏర్పడి ఆదివారం తనిఖీలు చేపట్టారు. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేటులోని లలిత లక్ష్మీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్, డిటర్జెంట్ పౌడర్, డిటర్జెంట్ కేక్ తయారీ యూనిట్లను పరిశీలించారు. అయితే యూరియా వినియోగిస్తున్న దాఖలాలు కనిపించలేదని ఏడీఏ సాలురెడ్డి తెలిపారు.
‘నైరుతి’ మందగమనం
● 13 మండలాల్లో తేలికపాటి వానలు
కర్నూలు(అగ్రికల్చర్): నైరుతి రుతుపవనాలు మే నెలలో ముందస్తుగా పలకరించినప్పటికీ ప్రస్తుతం మందగించాయి. జూన్ నెలతో ఖరీఫ్ సీజన్ మొదలై వారం రోజులు గడిచిపోయినప్పటికీ వర్షాలు నామమాత్రానికే పరిమితం అయ్యాయి. వరుణుడి కరుణ లేకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు 13 మండలాల్లో తేలికపాటి వానలు కురిశాయి. కేవలం 3 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది.
‘వక్ఫ్’ పరిధిలోకి
షాహి జామియా మసీదు
● టీడీపీ నాయకుడు గుజ్రీ రౌఫ్కు ఎదురు దెబ్బ
ఆదోని రూరల్: పట్టణంలోని షాహి జామియా మసీదును వక్ఫ్బోర్డు ఆధీనంలోకి తీసుకుని నిర్వహణను చేపట్టవచ్చని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ మసీదు నిర్వహణకు 2015లో ఎన్నికలు జరగగా టీడీపీకి చెందిన మైనార్టీ నాయకుడు గుజ్రీ రౌఫ్ వర్గం గెలుపొందింది. ఈ ఎన్నికల్లో నిబంధనలు పాటించలేదని మరో వర్గం అయిన ఎజాజ్ అహ్మద్, సలావుద్దీన్లు కోర్టుకు ఎక్కారు. ఇందుకు విరుద్ధంగా 2015కు ముందు మసీదు నిర్వహణ లెక్కల్లో అవకతవకలు ఉన్నాయని ఎజాజ్, సలావుద్దీన్పై గుజ్రీ రౌఫ్ వర్గీయులు కోర్టుకు వెళ్లారు. దీంతో కేసును ద్విసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. మసీదును వక్ఫ్బోర్డు ఆధీనంలోకి తీసుకుని నిర్వహణను చేపట్టవచ్చని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దాదాపు పదేళ్లు అయినా ఎన్నికలు జరగకపోవడంతో గుజ్రీ రౌఫ్ ఇష్టారాజ్యమే చెల్లుబాటు అవుతూ వచ్చింది. కోర్టు తీర్పుతో ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది.

రైల్వేస్టేషన్లో తనిఖీలు

రైల్వేస్టేషన్లో తనిఖీలు