‘మహా’ సమస్యలు! | - | Sakshi
Sakshi News home page

‘మహా’ సమస్యలు!

Jun 9 2025 10:22 AM | Updated on Jun 9 2025 10:22 AM

‘మహా’

‘మహా’ సమస్యలు!

పార్కింగ్‌ స్థలం లేక పాట్లు

మహానందీశుడి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు వివిధ వాహనాల్లో వస్తుంటారు. ఇదే అదనుగా భావించిన అధికారులు టోల్‌గేట్ల కోసం టెండర్లు నిర్వహించారు. కేవలం ఒక టోల్‌గేట్‌ టెండర్‌ ద్వారానే రూ. 1.68 కోట్లు ఆదాయం వచ్చింది. అయితే, భక్తుల వాహనాలను పార్కింగ్‌ చేసుకునేందుకు మాత్రం ప్రత్యేక స్థలం లేకపోవడంతో వారు తమ వాహనాలను నంది సర్కిల్‌ చుట్టూ మాడవీధుల్లోనే నిలుపుకోవాల్సి వస్తుంది. దీంతో ఈప్రాంతంలో నిత్యం ట్రాఫిక్‌ సమస్య తలెత్తుంది.

మహానందిలో భక్తులకు

కనీస సౌకర్యాలు కరువు

వసతి గదులు,

పార్కింగ్‌ స్థలం లేక అగచాట్లు

గాల్లో దీపంగా మారిన భద్రత

వైద్యసేవలకు కానరాని ఆసుపత్రి

అన్నప్రసాదాలు సరిపోక ఆకలితో

అలమటిస్తున్న భక్తులు

రూ. కోట్లలో ఆదాయమున్నా

పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

మహానంది: సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవు రూపంలో వెలసిన క్షేత్రం మహానంది. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం దర్శనార్థం దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఏడాదికి రూ. 17 కోట్లకు పైగా ఆదాయం వస్తున్న ఈ క్షేత్రంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరోజు బస చేద్దామంటే సరైన గదుల్లేవు. ఆహ్లాదంగా కాసేపు విశ్రాంతి తీసుకుందామంటే పరిసరాలు పచ్చగా కనిపించవు. కడుపు నిండా భోజనం చేద్దామంటే అన్నప్రసాదం పంపిణీ పరిమితమే. ఇలా ఒకటేంటి సమస్యలు కోకొల్లలు. ఏ ఆలయంలో నైనా ఒకటి లేదా రెండు సమస్యలు మాత్రమే ఉంటాయి. కానీ మహానందిలో ఉన్న మహా సమస్యలతో భక్తులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. నేడు రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి మహానంది ఆలయానికి వస్తున్న నేపథ్యంలో భక్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కథనం.

అన్నమో...మహానందీశా

ఏ ఆలయానికి వెళ్లినా భక్తులకు సరిపడా అన్నప్రసాదాల పంపిణీ జరుగుతుంది. ఆలయానికి రూ. కోట్ల ఆదాయంతో పాటు అన్నప్రసాద విభాగానికి రూ. 4.45 కోట్లు డిపాజిట్లు ఉన్నప్పటికీ మహానందిలో మాత్రం రోజుకు 200 మందికి, శని, ఆది, సోమవారాల్లో 300 మందికి మాత్రమే అన్నప్రసాదాల పంపిణీ చేస్తున్నారు. ఇందులోనూ నెలకు రూ.లక్ష వరకు వేతనాలు తీసుకునే రెగ్యులర్‌ ఉద్యో గులు ఇక్కడే భోజనాలు చేయడం గమనార్హం. ఉన్నతాధికారులు స్పందించి అన్నప్రసాదాల పంపిణీపై దృష్టి సారించి రోజుకు కనీసం 500 నుంచి 600 మందికి పంపిణీ చేపట్టాలని సుదూర ప్రాంత భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

భద్రత కరువు

మహానంది క్షేత్రంలో గతంలో ఉదయం నలుగురు, సాయంత్రం నలుగురు హోంగార్డులు విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం ఉదయం ఒకరు, మధ్యాహ్నం ఒకరు మాత్రమే విధులు చేపడుతున్నారు. భద్రతా విధులతో పాటు ఉదయం, సాయంత్రం జరిగే అష్టవిధ మహా మంగళ హారతుల సమయంలో ప్రత్యేకంగా విధులు చేయాల్సి రావడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయ ముఖ ద్వారం వద్ద రెగ్యులర్‌ ఉద్యోగి అంటూ ఒక్కరూ లేరు. దీంతో ఇటీవల తరచూ చోరీలు జరుగుతున్నాయి. కార్తీకమాసం, శివరాత్రి పర్వదినాల్లో వరుస చోరీలు జరిగిన విషయం తెలిసిందే. రాజగోపురం వద్ద ప్రైవేటు టెండరుదారులే ఉండటంతో తనిఖీలు నామమాత్రంగా జరుగుతున్నాయి. ఇక్కడ గతంలో రెగ్యులర్‌ ఉద్యోగులు విధుల్లో ఉండేవారు.

వసతికి అవస్థలు

మహానందిలో వసతి గృహాలు చాలా తక్కువగా ఉన్నాయి. దేవస్థానానికి చెందిన టీటీడీ వసతి గృహాల్లో కేవలం 26, నాగనందిలో 12 గదులు మాత్రమే ఉన్నాయి. వసతి గృహాలు తక్కువగా ఉండటంతో ప్రైవేటు లాడ్జీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. దీంతో పాటు పార్వతీపురం కాలనీలో గృహాలే లాడ్జీలుగా తయారయ్యాయి. వీటికి ఎలాంటి అనుమతి లేకపోగా అసాంఘిక కార్యకలాపాలకు ఇస్తూ నెలకు రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. భక్తులు రద్దీ లేని రోజుల్లో రూ. 300 నుంచి రూ. 500 వరకు ఇచ్చే గదులను ప్రతి శని, ఆది, సోమవారాల్లో రద్దీని బట్టి రూ. 1000 నుంచి రూ. 3000 వరకు ఇస్తున్నారు. దీంతో భక్తుల అవస్థలు వర్ణనాతీతం.

బస్‌షెల్టర్‌ కరువు

మహానందీశ్వరుడి దర్శనార్థం వచ్చిన భక్తులు బస్సుల కోసం నిలబడేందుకు స్థలం కరువైంది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు మహానందీశ్వరస్వామి దర్శనం ముగించుకుని సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే, ఆలయ ప్రాంగణంలో బస్సు షెల్టర్‌ లేకపోవడంతో వారి అవస్థలు భగవంతుడికే ఎరుక.

70 ఏళ్ల నాటి పైపులైన్లే గతి

మహానంది ఆలయ పరిధిలో పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదు. రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు పారిశుధ్య పనుల నిమిత్తం సుమారు 85 మందికి తీసుకుని వారికి వేతనాలు ఇస్తున్నా పనులు మాత్రం అలాగే ఉన్నాయి. 70 ఏళ్ల క్రితం వేసిన మంచి నీటి పైపులైన్లు, కాల్వలే గతి అయ్యాయి. దీంతో ఆలయ ప్రాంగణంలో పారిశుధ్య లోపం, తాగునీటి సమస్యతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కానరాని ఆసుపత్రి

మహానంది దేవస్థానం పరిధిలో ఒక్క ఆసుపత్రి లేదు. భక్తులకు అనుకోకుండా ఏదైనా జరిగి వైద్యమవసరమైతే దేవుడే దిక్కు. కొందరు ఇక్కడి కోనేరులో దిగిన తర్వాత మూర్చకు గురవుతుంటారు. తర్వాత కోలుకోలేక ఆలయ పరిధిలోనే మృత్యువాతకు గురైన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఆవరణలో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు వైద్యాధికారులు అందుబాటులో ఉండేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.

‘మహా’ సమస్యలు!1
1/2

‘మహా’ సమస్యలు!

‘మహా’ సమస్యలు!2
2/2

‘మహా’ సమస్యలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement