
వ్యక్తి ఆత్మహత్య
తుగ్గలి: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని జొన్నగిరిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు..గ్రామానికి చెందిన రాంపల్లి సతీష్(25)హైదరాబాద్లో చెత్త ఏరుతూ జీవనం సాగిస్తున్నాడు. చెత్త బండి కొనుగోలు, అనారోగ్యంతో ఉన్న తల్లి వైద్యం కోసం రూ.5లక్షల దాకా అప్పులు చేశారు. వాటిని ఎలా తీర్చాలన్న బెంగతో శనివారం రాత్రి ఇంటిపైన ఉన్న రేకుల షెడ్డులో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య భూమిక, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుడి తండ్రి ఆంజినేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆదివారం తెలిపారు.
జోరుగా నకిలీ విత్తన విక్రయాలు
నందవరం : ఆరు గాలం శ్రమించిన రైతన్నకు కష్టాలు తపడం లేదు..ఓ వైపు నకిలీ విత్తనాలు..మరో వైపు శ్రమించి పంట పడించిన దిగుడులు లేక, గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వానలు కురస్తుడడంతో రైతులు పత్తి పంట సాగుకు ఉపక్రమించారు. కొందరు దళారులు జోరుగా నాసిరకం, లూజు విత్తనాల విక్రయాలు కొనసాగిస్తున్నారు. అయినా అధికారుల చర్యలు, తనిఖీలు చేయకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాల్సిన ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికై న కూటమి ప్రభుత్వం, అధికారులు నకిలీ, లూజు విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుని, నాణ్యమైన విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
లోదుక్కులతో ప్రయోజనాలు
అవుకు: భూసార పరీక్షలు, లోదుక్కులతో మంచి ఫలితాలు ఉంటాయని, అధిక దిగుబడులు సాధించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మీప్రియ అన్నారు. ఆదివారం అవుకు మండలం సుంకేసుల గ్రామంలో వికసిత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారి అబ్దుల్ హక్తో కలిసి రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుస్థిర యాజమాన్యం, భూసార పరీక్షలు, సమగ్ర సస్యరక్షణ, పంటల సమయంలో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, లోతు దుక్కుల వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. బనగానపల్లె మండలం యాగంటిపల్లెలోని కృషి విజ్ఞాన కేంద్రంలో అందిస్తున్న సేవలను రైతులకు తెలియజేశారు. వర్మీకంపోస్ట్, నాణ్యమైన విత్తనాలు, ట్రైకోడెర్మా విరిడీ, వర్టిసిలియం, సుడో మోనాస్, డైరీ ఫామ్, గొర్రెల ఫామ్, కోళ్ల ఫామ్ ప్రారంభించాలనుకునే వారికి శాసీ్త్రయ సలహాలు, సూచనలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే మహిళలకు కుటీర పరిశ్రమల ఏర్పాటుపై శిక్షణనిస్తున్నామని చెప్పారు. అలాగే కేంద్రం ప్రభుత్వం అందించే పీఎం కిసాన్, పీఎంఎఫ్బీవై పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హార్టీకల్చర్ అసిస్టెంట్ పటాన్ నాయక్, గ్రామ పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి, పురుషోత్తంరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

వ్యక్తి ఆత్మహత్య