
గతంలోనూ ఇవే ఇబ్బందులు...
● కర్నూలు కార్పొరేషన్లో షాడో మంత్రి!
● ఫోన్లో అధికారులకు ఆదేశాలు
● ఫీల్డ్లో అభివృద్ధి పనుల తనిఖీ
● పాలనా పరమైన అంశాలపై
వాట్సాప్ చాటింగ్
● ఉన్నతాధికారులకు మించి
హడావుడి చేస్తున్న మంత్రి అనుచరుడు
కర్నూలు (టౌన్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతోంది. కర్నూలు నియోజకవర్గానికి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆయనకు అనుచరులుగా నలుగురు అధికార పార్టీకి చెందిన ప్రెవేటు వ్యక్తులు వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రతి వార్డులో పార్టీ తరఫున ఇన్చార్జ్లను నియమించారు. మంత్రి ఆదేశాల మేరకు వీరందరికీ నగరపాలక సంస్థ యంత్రాంగం ప్రొటోకాల్ ఏర్పాటు చేసింది. కర్నూలు నియోజకవర్గంలోని 33వ వార్డుల పరిధిలో ఏ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించినా వీరికి తప్పనిసరిగా మున్సిపల్ అధికారులు తెలియ జేయాల్సి ఉంటుంది. ఇంత వరకు బాగానే ఉంది. అయితే మంత్రికి సన్నిహితంగా ఉండే వ్యక్తి కార్పొరేషన్లో అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడు. రాత్రి 10 గంటలు దాటినా అధికారులకు ఫోన్లు చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు పనులు కావాలన్న ఆదేశాలతో మున్సిపల్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అయన హడావుడి చూస్తే ఉన్నతాధికారికి మించి చేస్తున్నారని మున్సిపల్ ఆధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన ఒత్తిడి
ముఖ్యమైన అధికారుల వద్ద మంత్రి అనుచరుడు గంటల కొద్దీ కూర్చోవడంతో పనులు పెండింగ్లో ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు ఫైళ్లు క్లియర్ కావడం లేదు. ముఖ్యమైన పని ఉంటే వెళ్లవచ్చు.. కానీ అదేపనిగా కలుస్తుండటంతో ఇబ్బందులు వస్తున్నాయని ఇంజినీరింగ్ అధికారి వాపోయారు. ఓ రకంగా మంత్రి అనుచరుడు షాడో మంత్రిగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం కన్నా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో చోటా మోటా నాయకుల ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే ఓ అధికారి వెల్లడించారు.
అతి జోక్యం
కార్పొరేషన్లో ఉన్న ముఖ్యమైన అధికారుల గ్రూపుల్లో మంత్రి అనుచరుడు ఉన్నాడు. నిత్యం ఏదో ఒక ఆదేశాలు జారీ చేస్తుంటాడు. ఆదేశాలు జారీ చేయడమే కాకుండా అప్పటికప్పుడు క్లియర్ అయిపోవాలన్న అనధికారిక ఉత్తర్వులు ఇస్తాడు. ఈయన హడావుడితో నగరపాలక పట్టణ ప్రణాళిక విభాగం, పారిశుద్ధ్య విభాగం, రెవెన్యూ విభాగం, ఇంజినీరింగ్ విభాగం ఇలా.. ప్రతి శాఖలో పనిచేసే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగంలో అధికారులు ఆయన చుట్టూ తిరిగే పరిస్థితులు ఉన్నాయి. ఫోన్లు చేయడమే కాకుండా వాట్సాప్ చాటింగ్ ఎక్కువ చేస్తున్నాడు. కార్పొరేషన్ కమిషనర్ కన్నా.. ఫీల్డ్లో పనులను పర్యవేక్షిస్తుంటాడు. ఎలాంటి సంబంధం లేకున్నా.. ఆయన పర్యవేక్షణ, ఆదేశాలు ఒకటేమిటీ.. ఏకంగా కమిషనర్కే ఆదేశాలు జారీ చేసే పరిస్థితి వచ్చింది.
అనధికార తనిఖీలు
‘‘మీతో ఎలా పనిచేయించుకోవాలో నాకు తెలుసు’’ అని అధికారులతో మంత్రి అనుచరుడు మాట్లాడుతున్నాడు. పాలనాపరమైన ఆంశాల్లోనూ జోక్యం చేసుకుంటున్నాడు. అధికారులతో కలిసి నిత్యం కాలనీలలో పర్యటనలు చేస్తుంటాడు. అధికారులకు సూచనల ఇవ్వడంతో పాటు కార్యాలయాలను అనధికార తనిఖీ చేస్తున్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈయన రాజకీయ నాయకుడు కాదు. అయినా మంత్రి అనుచరుడిగా మున్సిపల్ అధికారులపై పెత్తనం చేస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
‘ఏపీఎస్పీ క్యాంపులో లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పాం. స్థానికంగా పార్టీ బూత్ ఇన్చార్జ్లు ఫిర్యాదులు చేస్తున్నారు. వెంటనే ఏర్పాటు చేయండి’ అంటూ డీఈఈకి వాట్సప్ సందేశం పంపారు.
‘వెంకటరమణ కాలనీలో శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటరీ సెక్రటరీ సక్రమంగా పనులు చేయడం లేదు. వీరిపై చర్యలు తీసుకోండి. వెంటనే వారిని ఇతర శానిటేషన్ డివిజన్కు పంపించండి’ అంటూ మంత్రి నియమించిన ఓ ప్రెవేటు వ్యక్తి కమిషనర్ రవీంద్రబాబుకు, నగరపాలక ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విశ్వేశ్వర రెడ్డికి మేసేజ్ పంపించారు.
పై రెండే కాదు ఎన్నో సందేశాలను కర్నూలు కార్పొరేషన్లో అధకారులకు పంపుతున్నాడు. ఆయన ఎవరో కాదు మంత్రి అనుచరుడే! ప్రజాప్రతినిధి కాకపోయినా పెత్తనం చెలాయిస్తుండటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
మంత్రి దగ్గర పనిచేసే ఓ పీఏ గతంలో కార్పొరేషన్లో పెత్తనం చేశాడు. మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు ఎదుర్కొన్నారు. అప్పట్లో కమిషనర్ చాంబర్లో గంటల కొద్దీ కూర్చొని మాట్లాడేవాడు. కమిషనర్ను కలిసేందుకు వచ్చిన అర్జీదారులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం తన అనుచరుడు చేస్తున్న వ్యవహారంపై మంత్రి దృష్టి సారించాల్సి ఉంది. అధికారులపై పెత్తం చేస్తూ ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకోవడాన్ని అరికట్టాల్సి ఉంది.

గతంలోనూ ఇవే ఇబ్బందులు...

గతంలోనూ ఇవే ఇబ్బందులు...

గతంలోనూ ఇవే ఇబ్బందులు...