
బయో మైనింగ్ పనులు పూర్తి చేయండి
కర్నూలు (టౌన్): నగర శివారులోని గార్గేయపురంలో జరుగుతున్న బయో మైనింగ్ పనులు వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు ఆదేశించారు. ఆదివారం డంప్ యార్డులో బయో మైనింగ్ ప్రక్రియను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గార్గేయపురంలోని డంప్ యార్డులో బయో మైనింగ్ ప్రక్రియ చేపట్టారన్నారు. డంప్ యార్డులో 65 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించేలా చెత్త శుద్ధీకరణ లక్ష్యంగా పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే 43 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలకు బయో మైనింగ్ ప్రక్రియ పూర్తయ్యిందని, మిగిలిన 22 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ట్రామెల్ యంత్రం ద్వారా చెత్తను నాలుగు పద్ధతుల్లో ప్రాసెసింగ్ చేస్తారని, ప్లాస్టిక్, ఇనుము, గాజు వస్తువులు, రాళ్లు రప్పలను వేర్వేరు చేయడం జరుగుతుందన్నారు.
నగరంలో తనిఖీలు చేపట్టిన కమిషనర్
అంతకుముందు కమిషనర్ నగరంలో తనిఖీలు చేపట్టారు. ఏ.క్యాంపు, బళ్లారి చౌరస్తా, ఏపీఎస్పీ క్యాంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు కాలనీల్లో పారిశుద్ధ్య సమస్యలను గమచించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే ఓ టీ హోటల్ వద్ద అపరిశ్రుంభంగా ఉండటంతో నిర్వాహకుడిపై కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే ఏపీఎస్పీ క్యాంపు, బళ్లారి చౌరస్తా వద్ద నూతన బైపాస్ రహదారిని కమిషనర్ పరిశీలించారు.