
విజ్ఞాన పీఠంలో ప్రవేశాలు
● అనాథ బాలురకు అవకాశం
కర్నూలు కల్చరల్: నగర శివారులోని జి.పుల్లారెడ్డి నగర్లో ఉన్న విజ్ఞాన పీఠం అనాథ శరణాలయంలో కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని పీఠం కార్యదర్శి సి.మాణిక్య రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం 40 మంది అనాథ బాలురు పాఠశాలలో చేరారన్నారు. తల్లిదండ్రులు లేని నిరాశ్రితులుగా ఉన్న బీద బాలుర కోసం గత 50 సంవత్సరాలుగా విజ్ఞాన పీఠం వసతిగృహం నిర్వహిస్తోందని చెప్పారు. జి.పుల్లారెడ్డి దానం చేసిన స్థలంలో విశ్వహిందూ పరిషత్, విజ్ఞాన పీఠం అనాథ శరణాలయా న్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ అనాథ శరణాలయంతో పాటు ఎయిడెడ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా అనాథ బాలురు ఉంటే విజ్ఞాన పీఠంలో చేరవచ్చని కోశాధికారి రంగారెడ్డి పేర్కొన్నారు. ఉచిత వసతి, విద్య, వైద్యం అందిస్తామన్నారు. విజ్ఞాన పీఠం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.