● నది బఫర్జోన్లో రోడ్డు
● వరద నీరొస్తే కొట్టుకుపోయే అవకాశం
● జల వనరుల శాఖకు
కనీస సమాచారం ఇవ్వకుండానే
రోడ్డు నిర్మాణం
కర్నూలు సిటీ: నగరం మధ్యలో ప్రవహిస్తున్న హంద్రీనదిలో యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. నదిలో తవ్విన మట్టిని తీసి అదే నదిలో ఎలాంటి అనుమతులు లేకుండా బఫర్జోన్లో వేస్తున్న రోడ్డుకు వినియోగిస్తున్నారు. పగలు తవ్వకాలు చేస్తే ఎవరైనా అడ్డుకుండారనే ఉద్దేశంతో రాత్రి సమయంలో జేసీబీతో పని కానిస్తున్నారు. అధికారులు ఏ మాత్రం తమకు తెలియనట్టు వ్యవరిస్తుండడంపై అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే హంద్రీనది బఫర్జోన్లో అక్రమ కట్టడాలు నిర్మించడంతో నది కుచించుకపోయింది. నదికి 2007, 2009లో వరదలు రావడంతో తీర కాలనీలు నీటిలో మునిగిపోయాయి. ఇటీవలే నది బఫర్జోన్లోని కట్టడాలను గుర్తించి నది సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేసే పనులను చేపట్టారు. ఇంకా ఇందులో కేసీ కాలువ అక్విడక్ట్ నుంచి జోహరాపురం వరకు ఉన్న హంద్రీనది సరిహద్దులు గుర్తించాల్సి ఉంది. దీనిపై కర్నూలు నగరపాలక సంస్థ అధికారులకు శ్రీశైలం వరద రక్షణ విభాగం ఇంజినీర్లు ప్రతిపాదనలు పంపించారు.
గట్టు కోతకు గురయ్యే ప్రమాదం
కోట్ల కిసాన్ ఘాట్కు వెనుకటి భాగం, సిమ్మింగ్పూల్కు ఎదురుగా హంద్రీనదిలో మట్టిని జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నారు. భవిష్యత్తులో వరద నీరు ఎక్కువగా వస్తే ఆ గట్టు కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ తవ్విన మట్టిని రాజ్విహార్కి సమీపంలో అంబేద్కర్ భవనం, జెడ్పీ వెనుకటి భాగంలో హంద్రీబ్రిడ్జ్ నుంచి కల్లూరు దర్వాజా వరకు నడక దారిని నిర్మిస్తుంది కర్నూలు నగరపాలక సంస్థ. ఆ దారిని నిర్మించాలను కోవడంలో తప్పేలేదు. కానీ నది పరిరక్షణ చట్టాల ప్రకారం బఫర్జోన్ ఎలాంటి కట్టడాలు నిర్మించకూడదనే నిబంధనలను నగరపాలక సంస్థ ఇంజినీర్లు పట్టించుకోకపోవడంపై విమర్శలు ఉన్నాయి. జల వనరుల శాఖ అనుమతి తీసుకోకుండా రూ.50 లక్షలతో నడక దారిని బఫర్ జోన్లో నిర్మించవచ్చునా అనే విషయం తెలుసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తుండడంతో నదిలో పెద్ద గుంతలు కనిపిస్తున్నాయి. దీనిపై జల వనరుల శాఖ వరద రక్షణ విభాగం డీఈఈ శ్రీనివాస నాయక్ను వివరణ కోరగా నదిలో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నారు. బఫర్జోన్లో వేస్తున్న రోడ్డుకు సైతం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెబుతున్నారు.
అనుమతుల్లేకుండా హంద్రీలో తవ్వకాలు