దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ

Jun 8 2025 1:28 AM | Updated on Jun 8 2025 1:28 AM

దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ

దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను శనివారం పెద్దఎత్తున భక్తులు, యాత్రికులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగియనుండటంతో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు తమిళనాడు, కర్ణాటకలకు చెందిన యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీహోమాలలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం 11–30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేసి, క్యూలైన్‌లో వచ్చే సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో క్యూలైన్‌లో భక్తుల తాకిడి మరింత పెరిగింది. క్యూలైన్లలో భక్తులు త్వరత్వరగా ముందుకు కదిలేలా ఆలయానికి చెందిన వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఆలయ ప్రాంగణంలో భక్తులకు మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేశారు.సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలో ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement