
రైతుల సమస్యలను పరిష్కరిస్తాం
మోపర్రు(పెదపారుపూడి): రైతుల సమస్యలను పరిష్కరిస్తామని, అధైర్యపడవద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. మండలంలోని మోపర్రులో బుడమేరు వరదలకు వన్నేరు డ్రెయిన్కు పడిన గండ్లను ఆయన ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాతో కలిసి సోమవారం పరిశీలించారు. కొన్ని నెలల కితం వచ్చిన బుడమేరు వరదలకు మురుగునీరు సరిగా ముందుకు పారక వన్నేరు డ్రెయిన్ కట్టలు తెగిపోవటంతో పంటలు పూర్తిగా మునిగిపోయి నష్టపోయామన్నారు. మరలా అలాంటి నష్టం వాటిల్లకుండా కాలువ కట్టలను బలోపేతం చేసి తమను ఆదుకోవాలని రైతులు కలెక్టర్ను కోరారు. స్పందించిన ఆయన డ్రెయిన్ మరమ్మతుల కోసం ఏఏ నిధులు అందుబాటులో ఉన్నాయో జల వనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులతో మాట్లాడి, గండ్లను పూడ్చడంతో పాటు గండ్ల బలోపేతానికి తక్షణ చర్యలు తీసుకుంటామని రైతులకు కలెక్టర్ హామీ ఇచ్చారు.
రైతు సేవ కేంద్రాల్లో విత్తనాలు లేవు..
ప్రభుత్వ రైతు సేవ కేంద్రాల్లో రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు కలెక్టర్ బాలాజీకి ఏకరువు పెట్టారు. స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో గుడివాడ ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, జలవనరుల శాఖ ఈఈ కిరణ్, తహసీల్దార్ వై.రంగారావు, రైతులు పాల్గొన్నారు.