మేడూరు చోరీ కేసు ఛేదించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

మేడూరు చోరీ కేసు ఛేదించిన పోలీసులు

May 29 2025 1:23 AM | Updated on May 29 2025 1:23 AM

మేడూరు చోరీ కేసు ఛేదించిన పోలీసులు

మేడూరు చోరీ కేసు ఛేదించిన పోలీసులు

పమిడిముక్కల: మేడూరు చోరీ కేసును పమిడిముక్కల, గుడివాడ సీసీఎస్‌ పోలీసులు ఛేదించారు. రూ.3.50 లక్షల విలువైన 14 గ్రాముల బంగారం, ఒక కేజీ వెండీ స్వాధీనం చేసుకున్నారు. పమిడిముక్కల పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో గుడివాడ డీఎస్పీ వి.ధీరజ్‌ వినీల్‌ కేసు పూర్వాపరాలను వెల్లడించారు. మొవ్వ మండలం మొవ్వ గ్రామానికి చెందిన కాగిత పవన్‌కుమార్‌ విలాసాలకు అలవాటు పడి, సులభ సంపాదన మోజులో కృష్ణాజిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. హనుమంతపురం అడ్డరోడ్డు దగ్గరలో గల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద పమిడిముక్కల పోలీసులు పవన్‌కుమార్‌ని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. ఈ వస్తువులు ఎక్కడివని అడగ్గా గత సంవత్సరం అక్టోబర్‌ 23వ తేదీ రాత్రి మేడూరు గ్రామంలో దొంగిలించినట్లుగా చెప్పాడు. వస్తువులను తనిఖీ చేయగా పోలీస్‌స్టేషన్‌లోని రెండు కేసులకు సంబంఽధించినవిగా గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండు కేసుల్లో సుమారు రూ.3.50 లక్షల విలువైన 14 గ్రాముల బంగారం, ఒక కేజీ వెండి స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేయడానికి ఉపయోగించిన మోటార్‌ సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పవన్‌ గతంలో కూచిపూడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కూడా కొన్ని నేరాలు చేశాడు. అతనిని అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం ఉయ్యూరు కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వివరించారు. నిందితుడు పగటి సమయంలో గ్రామాల్లో తన స్నేహితులైన షేక్‌ బాబావలీ, జక్కుల చందురాజ్‌, ప్రసాద్‌బాబులతో కలిసి తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి ఆ రోజు ఏ ఇంటిలో దొంగతనం చేయాలో నిర్ణయించుకుంటాడు. అదే రోజు రాత్రి ఒక్కడే వెళ్లి తాళం పగులకొట్టి ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేస్తాడని డీఎస్పీ తెలిపారు.

ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డులు

ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పమిడిముక్కల సీఐ చిట్టిబాబు, ఎస్‌ఐ బి.శ్రీను, హెచ్‌సీ రషీద్‌, పీసీ శ్రీకాంత్‌, పీసీ సుధీర్‌, గుడివాడ సీసీఎస్‌ సీఐ రమణి, ఎస్‌ఐ స్వామిదాస్‌, హెచ్‌సీలు మస్తాన్‌, రాంబాబు, వేణుగోపాల్‌ను డీఎస్పీ ధీరజ్‌ వినీల్‌ ప్రత్యేకంగా అభినందించి, రివార్డు అందజేశారు. ఇంటికి తాళం వేసి బయట ప్రాంతాలకు వెళ్లేవారు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, వేసవికాలంలో ఆరుబయట నిద్రించే వారు వస్తువులను జాగ్రత్త చేసుకోవాలని డీఎస్పీ విజ్జప్తి చేశారు.

రూ.3.50 లక్షల విలువైన 14 గ్రాముల బంగారం, కేజీ వెండి స్వాధీనం

కేసు వివరాలు వెల్లడించిన

గుడివాడ డీఎస్పీ ధీరజ్‌ వినీల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement