
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సోమవారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కనిపించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకకు చెందిన భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచే అన్ని క్యూలైన్లలో భక్తులు బారలు తీరి కనిపించారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్వ దర్శనానికి రెండు గంటలు, రూ. 100, రూ.300 దర్శనం గంట లోపే పూర్తి కాగా, రూ. 500, వీఐపీ దర్శనం గంటన్నర పైగా సమయం పట్టింది. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో మహా మండపం ఆరో అంతస్తు వరకు, ఘాట్రోడ్డులో దేవస్థాన సమాచార కేంద్రం వరకు క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తరలించారు.
సర్వ దర్శనానికి రెండు గంటలు