
మారమంతే
మేమింతే..
వానాకాలం
గడువు ముగిసినా..
2024–25 వానాకాలం సీజన్లో 2,95,605 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం జిల్లాలోని 66 మిల్లులకు అందజేశారు. ఈ ధాన్యంలో క్వింటాకు 67 శాతం చొప్పున 1,98,066.880 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. బియ్యం అప్పగించే గడువు జూన్తోనే ముగిసినా ఇప్పటి వరకు 1,66,090.086 మెట్రిక్ టన్నుల బియ్యమే(84శాతం) అప్పగించారు. ఇంకా 31,976.794 మెట్రిక్ టన్నుల బియ్యం ఎప్పుడిస్తారో స్పష్టత రావడం లేదు. ఇందులో పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు అందించాల్సిన సన్నబియ్యం ఉండడం.. మిల్లర్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నా అధికారుల నుంచి చర్యలు లేకపోవడం గమనార్హం.
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను అందించడంలో కొందరు మిల్లర్లు నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. సకాలంలో ఽబియ్యం అప్పగంచకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించడం.. ఆతర్వాత చర్యల్లో పురోగతి లేకపోవడంతో పరిస్థితులు మారడం లేదు. 2024–25 వానాకాలం సీజన్కు సంబంధించి గడువు ముగిసినా మరో 16 శాతం సీఎంఆర్ బకాయి ఉన్నారు. ఇక యాసంగికి సంబంధించి ఇప్పటి వరకు 60శాతం మాత్రమే అందింది. ప్రధానంగా కొన్ని మిల్లులు మొద్దు నిద్రను వీడకపోవడం.. ప్రభుత్వం గడువు పెంచడం పరిపాటిగా మారుతున్నా ఈ ఏడాది ఇంకా ప్రకటన మాత్రం రాలేదు.
మరోసారి పెంచుతారా..
గడువు ముగిసినప్పటికీ సీఎంఆర్ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఏటా ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతుండగా, మరోసారి గడువు పెంచుతారులే అన్న ధీమాతో మిల్లుల యాజమాన్యాలు ఉంటున్నాయి. ఏటా గడువు ముగియగానే మరోసారి ప్రభుత్వం సమయం ఇస్తున్నా ఈసారి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే, 16 శాతం సీఎంఆర్ సేకరణకు ప్రభుత్వం గడువు పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.
యాసంగిలో 60 శాతం..
ఇక 2024–25 ఏడాది యాసంగి సీజన్ సీఎంఆర్ ఇప్పటి వరకు 60 శాతం అందజేశారు. ఈ సీజన్లో 4,55,981.360 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ ద్వారా మిల్లర్లకు అందజేయగా.. 3,05,743.351 మెట్రిక్ టన్నుల బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో 1,84,444.836 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించారు. మరో 1,21,298.515 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయాల్సి ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు గడువు ఉంది. కానీ రెండు నెలల్లో 40 శాతం బియ్యం మిల్లర్లు అందజేస్తారా, లేదా అన్నది వేచి చూడాల్సిందే.
కొందరు మిల్లర్లు తీరుతో..
జిల్లాలోని 66 మిల్లులకు పౌర సరఫరాల సంస్థ రెండు సీజన్లలో సీఎంఆర్ కోసం ధాన్యం అందజేస్తోంది. ఈ ధాన్యం అందించిన మూడు నెలల్లోగా బియ్యం అప్పగించాలనే నిబంధన ఉంది. అధికసంఖ్యలో మిల్లుల యాజమాన్యాలు గడువులోగా బియ్యం అందించే ప్రయత్నాలు చేస్తున్నా.. కొన్ని మిల్లుల యాజమాన్యాలు మాత్రం తమకేమీ పట్ట నట్టు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా సకాలంలో సీఎంఆర్ అందజేయని కొన్ని మిల్లులపై గత ఏడాది టాస్క్ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహించాయి. ఈమేరకు బియ్యం దారి మళ్లించినట్లు గుర్తించాయి. అయితే, అప్పుడప్పుడు కాకుండా ఏటా సీజన్ల వారీగా తనిఖీలు చేపడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటే సకాలంలో సీఎంఆర్ సేకరణ సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సీఎంఆర్ అప్పగింతలో
కొందరు మిల్లర్ల నిర్లక్ష్యం
2024–25 వానాకాలం గడువు ముగిసినా 16శాతం బకాయి
యాసంగి సీజన్లోనూ 60 శాతమే..
హెచ్చరికలే తప్ప
చర్యలు లేకపోవడంతో ఇష్టారాజ్యం
ఒత్తిడి తీసుకొస్తాం..
జిల్లాలో లక్ష్యం మేర సీఎంఆర్ సేకరణకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం. 2024–25 వానాకాలం సీజన్కు సంబంధించి మిల్లర్లు సీఎంఆర్ ఇచ్చే గతనెల 30తో ముగిసింది. ఇంకా బకాయి ఉన్న మిల్లర్లపై ఒత్తిడి తీసుకొస్తూ త్వరగా సీఎంఆర్ సేకరణ పూర్తిచేస్తాం. యాసంగికి సంబధించి సెప్టెంబర్ వరకు గడువు ఉన్నందున ఆలోగా లక్ష్యం మేర వసూలు చేస్తాం. – చందన్కుమార్,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

మారమంతే