
ఆ తొక్కిసలాట సర్కారు వైఫల్యమే
సాక్షి,బళ్లారి: ఐపీఎల్ టోర్నీ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించిన అనంతరం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైఫల్యంతో అక్కడ జరిగిన తొక్కిసలాట తదితర పరిణామాలతో 11 మంది మృతి చెందడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోస్తూ నిరసన తెలిపారు. రాయల్ సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేయడంతో పాటు సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ దిష్టిబొమ్మలు దహనం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్కుమార్ మోకా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రచారం కోసం పాకులాడిందన్నారు. లక్షలాది మంది అభిమానులు చేరుతారని తెలిసి కూడా అక్కడ తగిన భద్రత ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించిందన్నారు. తొక్కిసలాట ఘటనను తాము రాజకీయం చేస్తున్నామని కాంగ్రెస్ ఆరోపించడం శోచనీయం అన్నారు. 11 మంది అమాయకులు మృతి చెందితే వారి తరఫున పోరాటం చేయకూడదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ భద్రతా లోపం వల్ల తొక్కిసలాట జరిగిందని మండిపడ్డారు. ఈ ఘటనకు పోలీసు అధికారులను సస్పెండ్ చేయడంతో సరిపోదని, పాలకులు బాధ్యత వహించాలన్నారు. ఆందోళనలో బీజేపీ నాయకులు రామలింగప్ప, కార్పొరేటర్లు కోనంకి తిలక్, శ్రీనివాస్ మోత్కూరు, హనుమంతప్ప, గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
సీఎం, డీసీఎం దిష్టిబొమ్మలు దహనం చేసిన బీజేపీ
నగరంలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టిన వైనం